తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన గుజరాత్ యువ సంచలనం!
Recommended Video
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ మేవానీ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం సంచలనంగా మారింది.
అనుమతి లేకుండా నిరసనకు దిగిన కేసులో ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగని హైదరాబాద్ పోలీసులు నిర్బంధించడం, అనంతరం చంచల్గూడ జైలుకు తరలించడం తెలిసిందే.
బుధవారం జైల్లో ఉన్న మందకృష్ణను కలసిన జిగ్నేష్ సంఘీభావం వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర స్థాయికి చేరుకుందని ఆయన ఆరోపించారు.
గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యువత్రయం హార్థిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్పేష్ ఠాకూర్ ప్రధాని మోడీకే ముచ్చెమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు యువనాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు.
జిగ్నేష్ మేవానీ గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించి ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాడు. దళిత నేత మంద కృష్ణ మాదిగని పరామర్శించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన జిగ్నేష్ దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశాడు.
నాయకుడిని నిర్బంధిస్తే ఉద్యమం మరింతగా ఎగసి పడుతుందని జిగ్నేష్ మేవానీ హెచ్చరించారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దళితులకు ఐదెకరాల భూమిని కేటాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. బుధవారం మందకృష్ణను కలిసిన వారి జాబితాలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఉండడం గమనార్హం.