అక్కాచెల్లెళ్ల హత్య: మీడియా కంటపడకుండా.., అమిత్కు రిమాండ్
హైదరాబాద్: అక్కాచెల్లెళ్లను చంపిన అమిత్ సింగ్ను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం నాడు మధ్యాహ్నం కోర్టుకు తరలించారు. కొత్తపేట మోహన్ నగర్లో ఈ నెల 14వ తేదీన యామినీ సరస్వతి, శ్రీలేఖలను అమిత్ హత్య చేశాడు.
నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. రాత్రి చైతన్యపురి పోలీసు స్టేషన్లో ఉంచారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తరలించే ముందు ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. మీడియా కంటపడకుండా పోలీసు స్టేషన్ వెనుక వైపు నుంచి అమిత్ను వైద్య పరీక్షలకు తీసుకు వెళ్లారు.
అనంతరం ముఖానికి మాస్క్ వేసి కోర్టుకు తరలించారు. ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని సైబరాబాద్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు నిందితుడిని సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మెజిస్టేరేట్ కోర్టులో హాజరపరిచారు.
మెజిస్ట్రేట్ ఇందిర నిందితుడికి ఆగస్టు 12వ తేదీ వరకు రిమాండు విధించింది. పోలీసులు అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని చైతన్యపురి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి నుంచి ఆధారాలు రాబట్టాలని చెప్పారు. అవసరమైతే ఉత్తర ప్రదేశ్ లోని అతని స్వగ్రామానికి తీసుకు వెళ్లవలసి ఉంటుందన్నారు.