దారుణం: ప్రేమించలేదని, చనువుగా లేదని ఇంటర్ విద్యార్థినిపై బ్లేడుతో దాడి, మృతి
హైదరాబాద్: సికింద్రాబాదులో దారుణం జరిగింది. సహవిద్యార్థినితో చనువు పెంచుకున్న యువకుడు.. ఆమె కాదననందుకు బ్లేడుతో దాడి చేసి హత్య చేశాడు. అది చూసిన జనం అతనిని చితకబాదింది. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిసరప్రాంతంలో చోటు చేసుకుంది. పార్శిగుట్టకు చెందిన హరిప్రకాష్, రేవతిలకు ఇద్దరు కూతుళ్లు. హరిప్రకాశ్ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు.
కూతుళ్లు అంబర్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు అనూష వయస్సు 16 ఏళ్లు. హిమయత్ నగర్లోని ఆ కాలేజీలో చదువుతోంది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న వెంకట్ (18) అదే నారాయణగూడలోని కాలేజీలో చదువుతున్నాడు.
ట్యూషన్ సమయంలో ఇరువురికి పరిచయం ఏర్పడింది. అతను అనూషను ప్రేమించాడు. విషయం తెలిసిన ఆమె గత కొద్ది రోజులుగా అతనితో మాట్లాడలేదు. తనతో మాట్లాడకపోవడం, చనువుగా లేకపోవడంపై వెంకట్ అక్కసు పెంచుకున్నాడు.
మాట్లాడాలంటూ మంగళవారం సాయంత్రం ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ వద్దగల పోలీసు క్వార్టర్స్ దగ్గరకు రమ్మన్నాడు. ఇద్దరి మధ్య మాట మాటా పెరిగి ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. ఆమె గొంతు కోశాడు. అనూష కేకలు వేసింది. ఆమె కేకలు విని రైల్వే స్టేషన్ సమీపంలోని కొందరు అటువైపు పరుగు తీశారు. అక్కడ అనూష పడి ఉండటం గుర్తించారు.
అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన అతనిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకట్ పైన హత్య కేసు నమోదు చేశారు. అనూష మరణవార్తతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.