కత్తితో ప్రేమోన్మాది దాడి, అక్కాచెల్లెళ్లు మృతి: అడ్డొచ్చిన అక్క
హైదరాబాద్: భాగ్యనగరం చైతన్యపురిలోని కొత్తపేటలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు చెందిన శ్రీలేఖ, యామినిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. అనంతరం వారు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
శ్రీలేఖ నారాయణగూడలోని జాగృతి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అమిత్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఈ రోజు ఉదయం మోహన్నగర్లో నివాసముంటున్న శ్రీలేఖ ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు.
అడ్డుకోబోయిన శ్రీలేఖ అక్క యామినిపై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు వారిద్దరినీ కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యామిని, శ్రీలేఖ ఇద్దరూ మృతిచెందారు.
ఘటనా స్థలం నుంచి నిందుతుడు పరారయ్యాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అమిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో లారీలు ఢీ, డ్రైవర్లు సజీవ దహనం
మెదక్ జిల్లా మునిపల్లి మండలం బుదేరా వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. లారీలు మితిమీరిన వేగంతో గుద్దుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
సిలిండర్ పేలి గాయాలు
హైదరాబాదులోని కుత్బుల్లాపూర్లో గల ఓ అపార్టుమెంట్ వాచ్ మెన్ గదిలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.