బాబు లేఖ ఇచ్చాకే తెలంగాణ వచ్చింది: రామ్మోహన్కు టిఆర్ఎస్ ఎంపీ కౌంటర్
ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి గురువారం నాడు కౌంటర్ ఇచ్చారు. నాటి యూపీఏ ప్రభుత్వం ఏపీ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఉమ్మడి ఏపీని విభజించిందని రామ్మోహన్ నాయుడు అన్నారు.
అనంతరం టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన పైన ఎవరినీ దూషించవలసిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు నాడు కేంద్రానికి లేఖ ఇచ్చారని జితేందర్ రెడ్డి అన్నారు.
రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమే అన్నారు.
60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందన్నారు. వరంగల్ ఉప ఎన్నిక కెసిఆర్ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు. బిజెపి - టిడిపిలు కలిసినా అక్కడ తమ పార్టీ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిచారన్నారు.
తమ పార్టీ అభ్యర్థి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచారన్నారు. ఈ భారీ మెజార్టీయే కెసిఆర్ ప్రభుత్వ పని తీరుకు రెఫరెండం అని చెప్పారు. నాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.