విజృంభిస్తున్న కరోనా.. ఆ ఒక్క ప్రాంతంలోనే 25 కేసులు.. హైదరాబాద్లో ఇదీ పరిస్థితి..
కొద్దిరోజుల వరకు తెలంగాణలో సింగిల్ డిజిట్లోనే నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రెండు,మూడు రోజులుగా డబుల్ డిజిట్లో కేసులు నమోదవుతున్నాయి. సోమవారం (మే 11) ఒక్కరోజే హైదరాబాద్లో 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1275కు చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల పెరుగుదలపై నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
తమిళనాడులో కరోనా కల్లోలం: ఒక్కరోజే 798 పాజిటివ్ కేసులు
జియాగూడలో విజృంభిస్తున్న కరోనా
జియాగూడలో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రోజురోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగిగా తెలుస్తోంది. అయితే దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇందులో దుర్గానగర్లో 12, వెంకటేశ్వర్నగ్లో 6, శ్రీసాయినగర్లో 5, సంజయ్నగర్ 1, ఇందిరానగర్లో 1 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో రద్దీగా ఉండే జియాగూడ మేకలమండి, సబ్జీమండి, కూరగాయల మార్కెట్లు, దుకాణాలను మూసివేయించారు. ముందుజాగ్రత్తగా జియాగూడలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
జూబ్లీహిల్స్లో 13 మందికి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం 40 మంది కరోనా అనుమానితులకు ఆయుర్వేద ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మరో 80 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించినట్లు నోడల్ అధికారులు తెలిపారు. ఇక ఛాతీ ఆసుపత్రిలో సోమవారం ఒక పాజిటివ్ కేసు నమోదవగా, మరో 13 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నట్లు సూపరింటెండెంట్ మహబూబ్ఖాన్ తెలిపారు.
ఆ ప్రాంతాల్లో 4 పాజిటివ్ కేసులు
వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్కు చెందిన ఓ వ్యక్తి(43)కి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. అల్లాపూర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లో ఓ హమాలితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ తేలగా... అతడి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న మరో ముగ్గురికి తాజాగా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు సోమవారం వారిని ఆసుపత్రికి తరలించారు. కిషన్బాగ్ డివిజన్, కొండారెడ్డిగూడ ప్రాంతాల్లో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఓల్డ్ మలక్పేట్లో 3..
ఓల్డ్ మలక్పేట డివిజన్ లోని రేస్కోర్స్ రోడ్ లైన్ లోని సాధన అపార్ట్మెంట్లో రెండు రోజుల క్రితం ఓ వృద్ధురాలికి (65) కరోనా పాజిటివ్ రాగా, సోమవారం ఆమె భర్తకు (70), కోడలు (35) లకు పాజిటివ్గా తేలింది. వీరందరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అక్బర్బాగ్ డివిజన్ పల్టాన్కు చెందిన వ్యక్తికి (55)కు కరోనా పాజిటివ్ రాగా.. సోమవారం అతని కుమారుడికి కూడా (21) పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video
విజయ డయాగ్నోస్టిక్స్ సీజ్..
సికింద్రాబాద్ విజయ డయాగ్నస్టిక్ సెంటర్లో రిసెప్షన్ విభాగంలో పనిచేసే ఓ మహిళకు సోమవారం కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. మలక్పేట్ గంజ్లో పనిచేస్తున్న ఆమె తల్లికి కూడా పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ను మూసివేసి... ఉద్యోగులందరినీ క్వారెంటైన్కు తరలించారు. అలాగే ఆమె తల్లికి సంబంధించిన కాంటాక్ట్లను గుర్తించి క్వారెంటైన్ చేశారు.