సెగ ఢిల్లీకి తాకింది: మంథని మధుకర్ ఘటనపై ఏకమైన జేఎన్యూ..
తెలంగాణ భవన్ వద్ద జేఎన్యూ విద్యార్థుల నిరసనతో ఉద్రిక్తత నెలకొనడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోన్న మంథని మధుకర్ అనుమానస్పద మృతి కేసు ఇప్పుడు ఢిల్లీని తాకింది. ఘటనను నిరసిస్తూ ఢిల్లీలోని జేఎన్యూ విద్యార్థులంతా తెలంగాణ భవన్ ఎదుట భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
మధుకర్ మృతి కేసులో పారదర్శకంగా న్యాయ విచారణ చేపట్టాలని ఈ సందర్బంగా జేఎన్యూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధుకర్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని కేసును తొలుత విచారించిన సీఐపై ఆరోపణలు ఉండటంతో.. తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు ఈ నినాదాలు చేశారు.
తెలంగాణ భవన్ వద్ద జేఎన్యూ విద్యార్థుల నిరసనతో ఉద్రిక్తత నెలకొనడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అగ్ర కుల అమ్మాయిని ప్రేమించాడన్న కారణంగా దళిత యువకుడు మధుకర్ను పాశవికంగా హత్య చేశారన్న ఆరోపణలున్నాయి.
కేసీఆర్కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం
కళ్లు పీకి, మర్మాంగాలు కోసి, అత్యంత దారుణంగా మధుకర్ ను హత్య చేశారన్న ఆరోపణలతో.. దళిత సంఘాలు, ప్రజాస్వామిక వాదులంతా ఐక్యమై మంథనిలో మెరుపు ధర్నా నిర్వహించారు. దీంతో కేసు విచారణ ప్రస్తుతం ఏసీపీ సింధు శర్మ చేతుల్లోకి వెళ్లింది. మృతదేహానికి రీపోస్టు మార్టమ్ నిర్వహిస్తే అసలు నిజాలు బయపడే అవకాశం ఉంది.