ఇదీ టీఎస్పీఎస్సీ తీరు: అంతా తప్పుల తడకే.. ఉద్యోగార్థులకు కష్టాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంటే పారదర్శకంగా ఉద్యోగార్థులకు పారదర్శకంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘనంగా చెబుతూ వచ్చింది.
హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంటే పారదర్శకంగా ఉద్యోగార్థులకు పారదర్శకంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఘనంగా చెబుతూ వచ్చింది. కానీ ఆయా రాత పరీక్షల నిర్వహణలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు అభ్యర్థుల నుంచి వెలువడుతున్నాయి.
ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు, ఆప్షన్లు తప్పుగా ఇవ్వడం, ముద్రణ లోపాలు, కీలో తప్పులు ఉండడం వంటి కారణాలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. టీఎస్పీఎస్సీ తప్పులకు అభ్యర్థులు బలయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రంలో ముద్రణా లోపాన్ని సైతం టీఎస్పీఎస్సీ సరిదిద్దుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకానికి 2017, జులై 19వ తేదీన పీజీటీ సోషల్ స్టడీస్ మెయిన్స్ రాతపరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాలు, వాటికి ఇచ్చిన జవాబుల్లో ఒకదానికి సంబంధం లేని ఆప్షన్లు ఇవ్వడంతో అభ్యర్థులు ఇబ్బందులనెదుర్కొంటున్నారు.
ఇలా టీఎస్పీఎస్సీ తుది కీ
పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్ పేపర్-1 పేపర్ కోడ్ సీ ప్రశ్నాపత్రంలో 20వ ప్రశ్నకు ఆప్షన్లు 1,2,3,3 ఇచ్చారు. ప్రశ్నాపత్రంలో ఉన్న దాన్నే ప్రామాణికంగా కొందరు భావించి జవాబు 4 అని తెలిసినా 3ను దిద్దారు. కానీ టీఎస్పీఎస్సీ తుది కీలో జవాబు 4 అని గుర్తించింది. అదే పేపర్లో 144 ప్రశ్నకు 1,2,2,4 ఆప్షన్లు ఇచ్చారు. ఇందులోనూ ప్రశ్నాపత్రంలో ఉన్న ఆప్షన్లను ప్రామాణికంగా తీసుకొని జవాబు 3 అని తెలిసినా 2 అని దిద్దారు. టీఎస్పీఎస్సీ తుది కీలో జవాబు 3 అని పొందుపరిచింంది. అదే ప్రశ్నాపత్రం పేపర్ కోడ్ ఏ 138 ప్రశ్నకు 1,2,2,4 ఆప్షన్లు ఇచ్చారు. 3 సరైన జవాబు అని తుది కీలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు సరైన సమాధానం తెలిసినా ప్రశ్నాపత్రంలో లేనందున 2 అని కొందరు గుర్తించారు.
అభ్యర్థుల అభ్యర్థనలు పట్టించుకోని టీఎస్పీఎస్సీ
ఇలా ప్రశ్నాపత్రంలో ముద్రణ లోపాలున్నా టీఎస్పీఎస్సీ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కొందరు అభ్యర్థులు ప్రాథమిక కీ విడుదలైనప్పుడే కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అభ్యంతరాలు మెయిల్, ఫ్యాక్స్ రూపంలో పంపినా ఫలితం రాలేదు. తుది కీలో అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆ మార్పులను చేస్తూ ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ స్టడీస్ పేపర్-1లోనే జతపరచాలన్న ఓ ప్రశ్నలో క్రిస్టోఫర్ కొలంబస్- అన్వేషకుడు, ఆమర్త్యసేన్-సంక్షేమ అర్థశాస్త్రం, మదర్థెరిస్సా- మిషనరీస్ ఆఫ్ చారిటీస్, కారల్మార్క్స్- రాజకీయ ఆర్థికవేత్త అన్న ఆప్షన్లను సరైన జవాబుగా టీఎస్పీఎస్సీ గుర్తించింది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కానీ కారల్మార్క్స్ ఆర్థికవేత్తతోపాటు రెవల్యూషనరీ సోషలిస్టు అన్నదీ గుర్తించాలని కొందరు అభ్యర్థులు టీఎస్పీఎస్సీని కోరుతున్నారు. దీంతో ఆ ప్రశ్నకు 3 / 4 ఆప్షన్లలో ఏది దిద్దినా సరైన జవాబుగా పరిగణించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రశ్నకు ఇలా ఆప్షన్లు
పీజీటీ సోషల్ స్టడీస్ మెయిన్స్లో డిసిప్లిన్ నాలెడ్జ్ ఇన్ సోషల్ స్టడీస్ పేపర్-2లో పార్టీ ఫిరాయింపుల చట్ట నిబంధనలు గుర్తించండి అని ఓ ప్రశ్న అడిగారు. దీనికి ఆప్షన్లుగా.. ‘ఈ బిల్లును పార్లమెంటు 1986లో ఆమోదించింది', ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి పోతే వారి సభ్యత్వం రద్దవుతుంది', ‘ 1/3వ వంతు సభ్యులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తే ఈ చట్టం వారికి వర్తించదు', ‘ సుప్రీం కోర్టు, హైకోర్టులకు ఆ ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసే అధికారం ఉంటుంది' అని ఇచ్చారు. దీనిపై టీఎస్పీఎస్సీ తుది ‘కీ'లో ఆప్షన్ 2 సరైన జవాబని ప్రకటించింది.
91వ సవరణలో ఇలా ఫిరాయింపుల చట్ట సవరణ
1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం 1/3వ వంతు ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వారికి పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2/3వ వంతు ప్రజాప్రతినిధులు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపుల చట్టం వారికి వర్తించదు. టీఎస్పీఎస్సీ గుర్తించిన సరైన జవాబులో వాస్తవం లోపించినా పరిగణించడం అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. ఆ ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో ఏదీ సరైన సమాధానం లేదని కొందరు అభ్యర్థులు అంటున్నారు.
న్యాయం చేయాలని కోరుతున్న అభ్యర్థులు
ఫిరాయింపుల నిరోధక చట్టంపై ఆప్షన్ల మాదిరిగా ప్రశ్నాపత్రం ముద్రణాలోపాలు, ఆప్షన్లలో తప్పులు, వాస్తవాలు చెప్పినా టీఎస్పీఎస్సీ పరిగణించకపోవడం పట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పీజీటీ సోషల్ స్టడీస్ పేపర్-1లో 20 ప్రశ్నకు 3, 4 ఆప్షన్లను పరిగణించాలని, 144 ప్రశ్నకు 2,3 ఆప్షన్లను సరైనవిగా గుర్తించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అభ్యర్థులు అంటున్నారు. ఆ రెండు మార్కులు కోల్పోతే తమకు ఉద్యోగం వచ్చే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నదని అంటున్నారు. ఉద్యోగాన్ని ఆ రెండు మార్కులే నిర్ణయించే అవకాశమూ లేకపోలేదని, తమ అభ్యర్థనను మన్నించి టీఎస్పీఎస్సీ న్యాయం చేయాలని కోరుతున్నారు. పేపర్ కోడ్ సీ రాసిన వారు 500 మంది ఉన్నారని అంచనా.