అమెరికా ఉద్యోగం పోగొట్టుకుని.. మానసిక వేదనతో టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: అమెరికాలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఏళ్ల తరబడి తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ టెక్కీ తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ కిటికీలోంచి కిందికి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్లో చోటుచేసుకుంది.
కార్ఖానా పోలీసుల కథనం ప్రకారం... కె.రవికుమార్(42) సాఫ్ట్వేర్ ఇంజనీరు. అమెరికాలో చేస్తున్న ఉద్యోగం పోవడంతో 2004లో తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అప్పట్నించి సికింద్రాబాద్లోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో నివసిస్తూ మెంటల్గా డిప్రెషన్కు గురవుతున్నాడు.
అతడి భార్య ఓ దుకాణంలో పనిచేస్తోంది. సంతానం కూడా లేకపోవడంతో ఆత్మన్యూనతకు లోనైన రవికుమార్ తరచూ భార్యతో గొడవపడుతుండే వాడు. ఆదివారం ఉదయం కూడా భార్యతో గొడవ పడ్డాడు.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఫ్లాట్ కిటికీ అద్దం పక్కకి జరిపి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రవికుమర్ మృతి చెందాడు. సమాచారం అందగానే కార్ఖానా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రవికుమార్ తన ఫ్లాట్ కిటికీలోంచి కిందికి దూకడాన్ని గమనించిన స్థానికుడొకరు ఆ దృశ్యాన్ని తన ఫోన్లో వీడియో కూడా తీశారు.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవడం వల్లే అతడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని, ఆ వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అర్థమవుతోందని, అయితే అతడి వద్ద ఎలాంటి సూయిసైడ్ నోట్ లభించలేదని కార్ఖానా సీఐ బి.జానయ్య తెలిపారు.