కేంద్రం మెచ్చుకున్నా..: జోగు రామన్న ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న అదిలాబాదులో శనివారం అన్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందన్నారు.
ప్రభుత్వం కేవలం ప్రజల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని చిత్తశుద్ధితో పని చేస్తుండగా, ఓటమి భారాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నేతలు తమ మనుగడను కాపాడుకునేందుకు స్థాయిని మరచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును విమర్శిస్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసిస్తుండగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మాత్రం కళ్లు మూసుకొని రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏనాడు కృషి చేయని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు.