రేవంత్ రెడ్డి జోకర్: జోగు రామన్న, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విచారణకు ఆదేశం
అదిలాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి పైన మంత్రి జోగు రామన్న మంగళవారం నాడు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ జోకర్ అని, బ్రోకర్ అని నిప్పులు చెరిగారు. రైతుల ధర్నా పేరిట తెలంగాణ టిడిపి నిర్వహించిన ధర్నాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం అన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రేవంత్ రెడ్డి పైన న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
జీవన్ రెడ్డి లేఖ
కులాలను ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కొన్ని కులాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. గిరిజనుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడవద్దన్నారు.
ఉప ముఖ్యమంత్రులను బానిసలుగా: జైపాల్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రులను సీఎం కెసిఆర్ బానిసలుగా చూస్తున్నారని మాజీ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలన్నారు. టిఆర్ఎస్ విచ్చలవిడితనం, అహంకారానికి ఈ ఎన్నికలు నిదర్శనమని చెప్పారు.
వరంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి కానుక ఇవ్వాలన్నారు. దళితులు, మైనార్టీలకు ఇస్తామన్న 12 శాతం రిజర్వేషన్ ఏమయిందని ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా టిఆర్ఎస్కు ఓటేయాలన్నారు.
టిఆర్ఎస్ ఓడితే మంచి పాలన వస్తుందన్నారు. వరంగల్ ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా స్వాగతిస్తామన్నారు. టిఆర్ఎస్ రాజకీయాలను జూదంగా మారిచందని ఆరోపించారు.
రాధాకృష్ణపై విచారణకు కోర్టు ఆదేశం
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై విచారణకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆవిభాజ్య కవలలు వీణా, వాణిల పేరిట విరాళాలు సేకరించి బాధితులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని పేర్కొంటూ జనార్ధన్ గౌడ్ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన న్యాయమూర్తి రాధాకృష్ణపై విచారణ జరిపి ఈనెల 16 లోపు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఐపీసీ సెక్షన్ 406, 420, 120(బి) కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు.