నిజాయితీ ఎఫెక్ట్: రాజకీయ ఒత్తిళ్లు, థానే నుంచి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ బదలీ
ముంబై: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తును చూసిన సిబిఐ మాజీ డైరెక్టర్, ప్రస్తుత థానే సంయుక్త పోలీస్ కమిషనర్గా ఉన్న వివి లక్ష్మీనారాయణ బదలీ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అదనపు డిజిపి-అడ్మినిస్ట్రేటివ్గా పదోన్నతి కల్పించి, బదలీ చేసింది.
నిజాయతీగా విధులు నిర్వర్తిస్తూ అక్రమార్కులపై విరుచుకుపడుతున్న లక్ష్మీనారాయణ శైలి మింగుడుపడని కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే ఈ బదలీ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల థానేకు చెందిన బిల్డర్ సూరజ్ పరిమార్ ఆత్మహత్య కేసులో లక్ష్మీనారాయణ కఠినంగా వ్యవహారించారు.
దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు కార్పొరేటర్లు ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ బదలీ జరిగింది. ఈ బదిలీపై సోషల్ మీడియాలోను పెద్దయెత్తున చర్చ జరిగింది. ఆయన్ను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ప్రశ్నిస్తూ పలుచోట్ల హోర్డింగులు వెలిశాయి.
లక్ష్మీనారాయణ బదిలీకి ముఖ్యమంత్రి ఫడ్వనీస్ తొలుత ససేమీరా అన్నారని తెలుస్తోంది. అయితే, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బదలీ చేయక తప్పలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా థానేలో లక్ష్మీనారాయణ స్థానంలో అశుతోష్ దుంబ్రే అపాయింట్ అయ్యారు.