చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత
హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో షాక్ తగిలింది. కొండా రాజీనామా చేసిన మరుసటి రోజే మరోకీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే సంజీవ రావు తెరాసకు రాజీనామా చేశారు.
సంజీవరావు అసంతృప్తి, పార్టీకి గుడ్ బై
అసెంబ్లీ ఎన్నికలకు మరో పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో అధికార పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు తెరాస నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అసంతృప్తులు పార్టీని వీడుతున్నారు. వికారాబాద్ స్థానాన్ని ఈసారి తెరాస నుంచి మెతుకు ఆనంద్కు కేటాయించారు. దీంతో సంజీవరావు అసంతృప్తికి లోనయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపించారు. వికారాబాద్ స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
మెతుకు ఆనంద్కు టిక్కెట్
మెతుకు ఆనంద్కు టిక్కెట్ ఇవ్వడం తనకు బాధగా లేదని, కానీ తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని సంజీవరావు చెప్పారు. నాలుగున్నరేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నానని, అలాంటి తనను సంప్రదించకుండా టిక్కెట్ ఇవ్వడం ఏమిటన్నారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు ఉన్నారని, మరొకరికి ఇవ్వాలనుకుంటే తనకు చెప్పాల్సి ఉండెనని అన్నారు.
చివరి నిమిషం వరకు నా భార్యకు ఇస్తామని చెప్పారు కానీ
తన సతీమణికి టిక్కెట్ ఇస్తామని చివరి నిమిషం వరకు మహేందర్ రెడ్డి చెప్పారని సంజీవరావు అన్నారు. ఏదో కారణాలతో తనకు ఇవ్వడం లేదని చెప్పారని, అంత వరకు బాగుందని, కానీ మా భార్యకు ఇవ్వమంటే సరేనని చెప్పారని, కానీ ఇచ్చేటప్పుడు తనకు ఏం చెప్పలేదన్నారు. ఈరోజు వరకు తనకు ఎవరూ చెప్పలేదన్నారు. తాను ఏ పార్టీలో చేరాలని భావించడం లేదని, అందుకే చంద్రశేఖర్కు మద్దతిస్తున్నానని చెప్పారు. చంద్రశేఖర్ను గెలిపించిన అనంతరం, ఆ తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వేరే పార్టీలోకి వెళ్లాలా లేక ఏం చేయాలో ఆలోచిస్తానని సంజీవ రావు చెప్పారు.
కేసీఆర్ మళ్లీ గెలిస్తే అంతే
కేసీఆర్ పదేపదే అబద్దాలు చెబుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ వేరుగా విమర్శించారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలు అందరు కూడా సాష్టాంగ నమస్కారాలు చేయాల్సిందేనని మండిపడ్డారు. తెరాసకు వంద సీట్లు వస్తే తాను ముక్కును నేలకు రాస్తానని సవాల్ చేశారు. గ్రేటర్ హైదరాబాదులో ఒక్కో అభ్యర్థికి రూ.25 కోట్లు అప్పగించారని చెప్పారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే తనను పార్టీ నుంచి పంపించారని విమర్శించారు. తెరాస నుంచి ఇప్పుడు వలసలు ప్రారంభమయ్యాయని, ముందు ముందు మరిన్ని ఉన్నాయని చెప్పారు.