బిగ్బాస్లో మరో జర్నలిస్టు... సీజన్ -3లో టీవీ-9 కాంట్రవర్సీ రిపోర్టర్..?
ప్రముఖ రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ -3 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. సాధారణంగా షో బిగిన్ అయ్యాక అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ నుంచి వివాదాలు మొదలవుతాయి. కానీ ప్రారంభానికి ముందే ఈ రియాల్టీ షో వివాదాలు మూటగట్టుకుంటోంది. అయితే ఇది తమకు ఉచిత ప్రమోషన్ను తీసుకొచ్చి పెడుతోందని షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు కంటెస్టెంట్స్ అంతా ఫైనలైజ్ అయ్యారు. సీజన్ -2లో టీవీ జర్నలిస్టు దీప్తికి స్థానం దక్కగా... ఈ సారి అంటే సీజన్ త్రీలో కూడా ఓ ప్రముఖ జర్నలిస్టుకు చోటు లభించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు..?
సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా చేసిన షో
బిగ్ బాస్... దేశంలోని ప్రధాన భాషల్లో బుల్లితెరపై నిర్వహించబడుతున్న షో. ప్రశంసలతో పాటు వివాదాలు మూటగట్టుకున్న షో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెలిబ్రిటీలు మరో స్థాయికి వెళ్లిపోయారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతారు. అంతేకాదు సాధారణ వ్యక్తులను కూడా ఈ షో సెలిబ్రిటీలుగా మార్చింది. తెలుగులో తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా పరిచయం అయిన ఈ బిగ్షో సీజన్ వన్ సూపర్ హిట్ అయ్యిందనే చెప్పాలి. ఇక రెండో సీజన్లో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్లా షోను నానీ క్యారీ చేయలేకపోయారనే విమర్శలు వినిపించాయి. అంతేకాదు సీజన్ -2 చాలా వివాదాలనే తీసుకొచ్చింది. సీజన్ -2 విన్నర్ కౌశల్ ఓటింగ్లో అక్రమంగా జరిగిందనే వాదన వినిపించింది. ఇక తాజాగా సీజన్-3 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి స్వయంగా 'మన్మథుడు' అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్ స్టేజెస్కు చేరుకున్నాయి.
కాంట్రవర్శీ జర్నలిస్టు జాఫర్కు దక్కిన చోటు
ఇక ఇప్పటికే ఈ షోలో కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యారు. బిగ్బాస్ రెండో సీజన్లో టీవీ జర్నలిస్టు దీప్తి పాల్గొనింది. చివరి వరకు మంచి ఫైట్ ఇచ్చింది. తాజాగా అంతకుమించి ఫైట్ ఇచ్చేందుకు మరో ప్రముఖ జర్నలిస్టు జాఫర్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బిగ్బాస్ -3 షోలో వివాదాలకు కేరాఫ్గా మారిన జర్నలిస్టు జాఫర్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రాజకీయనాయకులను సినిమా నటులను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన జాఫర్... ఇక హౌజ్లో సభ్యులకు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వైసీపీ ఎమ్మెల్యే రోజాను, నటులు మోహన్ బాబుతో పాటు చింతమనేనికే చిర్రెత్తే ప్రశ్నలు వేసి కాంట్రవర్శీ క్రియేట్ చేశాడు జాఫర్. ఇక వీరే కాదు జాఫర్ దెబ్బకు బలైనవారు చాలామంది ప్రముఖులే ఉన్నారు. తన ప్రశ్నలతో ప్రముఖులను ఇరుకున పెట్టే చాకచక్యం ఉన్నవాడు జాఫర్. అందుకే షోలో కాంట్రవర్శీ క్రియేట్ చేసే వారికోసం నిర్వాహకులు ఎదురు చూసి జాఫర్ను తీసుకున్నట్లు సమాచారం.
హైకోర్టు తలుపు తట్టిన బిగ్బాస్ నిర్వాహకులు
ఇక బిగ్బాస్ షోలో పాల్గొనాల్సిందిగా మరో ప్రముఖ జర్నలిస్టు టీవీ 5 మూర్తిని కూడా షో నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. అయితే తను ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ షోలో తీన్మార్ సావిత్రితో పాటు వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా, యాంకర్ శ్రీముఖి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రాయలసీమ యాసతో ఆకట్టుకున్న యూట్యూబ్ స్టార్ మహేష్తో పాటు మరికొందరు కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే బిగ్బాస్ షో పై ఇప్పటికే నటి గాయత్రి గుప్తా, మరో జర్నలిస్టు శ్వేతారెడ్డిలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం షో నిర్వాహకులు కూడా తమపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో ఈ షో భవితవ్యం ఉంది.