మొన్న ఉద్యమకారుడు.. నిన్న జర్నలిస్ట్.. నేడు ఎమ్మెల్యే
ఉద్యమకారుడు జర్నలిస్ట్ అవుతారా? జర్నలిస్ట్ ఎమ్మెల్యే అవుతారా? ఇలాంటి పార్శ్వాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. కానీ ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంటి క్రాంతి కిరణ్ నేపథ్యం మాత్రం అలాంటిదే. ఒకనాడు ప్రజాపోరాటాలు చేసిన క్రాంతి.. అదే ఒరవడిని కొనసాగిస్తూ పాత్రికేయ వృత్తిలోకి వచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
ప్రజా పోరాటం.. ఉద్యమ ప్రస్థానం
టీవి జర్నలిస్టుగా క్రాంతి రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. కానీ ఆయనకు ప్రజా పోరాట నేపథ్యమున్న సంగతి చాలామందికి తెలియదు. పాత్రికేయ వృత్తిలోకి రాకముందు ప్రజా సమస్యలపై గళమెత్తారు. ఎన్నో సందర్భాల్లో తాను ముందుండి పోరాటాలు చేశారు. అలా నాయకత్వ లక్షణాలు మెండుగా నిండి ఉన్న క్రాంతి.. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడానికి ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ లో కీ రోల్ పోషించారు. ఓ వైపు జర్నలిస్ట్ గా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గా కళ్లకు కట్టినట్లుగా కథనాలు అందించారు. పోలీసుల లాఠీలు ఉద్యమకారులపై ఎగిరెగిరిపడ్డప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. జర్నలిస్ట్ ఫోరం వేదికగా ఖండించారు.
ది లీడర్
జర్నలిస్టుగా రాణిస్తున్న క్రాంతిలో నాయకత్వ లక్షణాలు చూశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పడ్డ శ్రమను గుర్తించారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇచ్చారు. ఆందోల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబుమోహన్ ను కాదని మరీ క్రాంతికి టికెటివ్వడం విశేషం. అప్పటికే బాబుమోహన్ స్థానికేతరుడు కావడం, ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత క్రాంతికి కలిసొచ్చింది.
క్రాంతి కూడా చాలా సందర్భాల్లో స్థానికతను టార్గెట్ చేశారు. అలా మొత్తానికి ఆందోల్ ప్రజలు క్రాంతికి పట్టం కట్టారు. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన క్రాంతిని శాసనసభ్యుడిగా గెలిపించారు. 16, 465 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన క్రాంతికి లక్షా 4వేల 229 ఓట్లు పోలయ్యాయి. సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు 87,764 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీచేసిన బాబుమోహన్ 2,404 ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కోల్పోయారు.
క్రాంతి అనే నేను..!
జర్నలిస్టుగా చాలా సందర్భాల్లో అసెంబ్లీకి వెళ్లారు క్రాంతి. శాసనసభ నిర్వహణపై రిపోర్టింగ్ తో పాటు ఎన్నో విశ్లేషణలు చేసిన క్రాంతికి శాసనసభ్యుడిగా మాత్రం కొత్త అనుభవం ఇది. ప్రజాపోరాటాల నేతగా గళమెత్తిన క్రాంతి.. ఇప్పుడు ప్రజాసమస్యలపై సభలో మరో స్వరం వినిపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వ్యక్తిగా ఎన్నో ఒడిదొడుకులు చవిచూసినా.. ఇప్పుడు ఎమ్మెల్యేగా బాధ్యతతో మెలగాల్సి ఉంటుంది. అన్నా అంటే చాలు ఇట్టే కలిసిపోయే వ్యక్తిత్వమున్న క్రాంతికి ఇదేమీ పెద్ద విషయం కాకపోవచ్చు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఎమ్మెల్యే క్రాంతి.