ఏబీఎన్, టీవీ9 నిలిపివేత: ప్రభుత్వానికి హెచ్చరిక
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 జర్నలిస్టులు సోమవారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ఛానెళ్లను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల దీక్షకు పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో చానళ్ల ప్రసారాలను నిలిపివేసి మీడియా గొంతు నొక్కడం సరికాదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. జర్నలిస్టుల నిరసన దీక్షకు జూలకంటి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మీడియాపై కక్ష సాధింపులు మానుకోవాలన్నారు.
చవటలు, దద్దమ్మలు అన్న నేతల వ్యాఖ్యలు తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ప్రసారాలను పునరుద్దరించాలన్నారు. ఏ మీడియాతో మీరు పెద్ద నాయకుడయ్యారో అదే మీడియా ద్వారా పతనం కాక తప్పదని జూలకంటి హెచ్చరించారు.
చానళ్లపై నిషేధం విధించడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. తప్పులను చూపించే హక్కు మీడియాకు ఉందని, ప్రభుత్వం మీడియాను అడ్డుకోవడం సరికాదన్నారు. మీడియా పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్పష్టం చేశారు.
చానళ్ల ప్రసారాలు నిలిపివేత దేశంలో ఎన్నడూ జరగలేదని ఐజేయూ నేత అమర్ అన్నారు. బ్రిటిష్ పాలనలో కూడా పత్రికలపై ఇలాంటి దాడి జరగలేదని గుర్తు చేశారు. ఇలాంటి తెలంగాణానా మనం సాధించుకున్నది అని వాపోయారు. తెలంగాణలో మీడియాపై దాడిని ముందే ఊహించామన్నారు. తెలంగాణలో చానళ్ల ప్రసారాల పునరుద్దరణకు జర్నలిస్టులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు అమర్ ప్రకటించారు.
కేసీఆర్ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ అన్న కుమార్తె రమ్య అన్నారు. అర్ధరాత్రి తర్వాత వేరే పార్టీ నాయకులకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారని, ప్రజలకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడానికి సమయం ఉండదుకానీ వేరే పార్టీ నేతలకు మాత్రం అర్ధరాత్రి సమయంలో అపాయింట్మెంట్లు ఇవ్వడానికి సమయం ఉంటుందా? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణలో చానెళ్లను ఆపే హక్కు ఎంఎస్వోలకు ఎవరు ఇచ్చారని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం చూస్తుంటే కేసీఆర్ తీరు టీన్యూసే చూడాలి, నమస్తే తెలంగాణ పేపరే చదవాలి అన్నట్లు ఉందని టీడీపీ నేత అరికెల నర్సారెడ్డి మండిపడ్డారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నెలలుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 చానళ్ల ప్రసారాలను ఎమ్మెస్వోలు నిలిపివేసిన విషయం తెలిసిందే.