ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య .. మున్సిపల్ ఎన్నికలకు ముందు .. ఇంట్లోకి చొరబడి , కత్తులతో పొడిచి..
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన వారెవరు ? ఈ దాడి రాజకీయ నేపథ్యంలో జరిగిందా? లేక ఇతర వ్యక్తిగత కారణాల నేపథ్యంలో జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
మరో ఎన్నికల వ్యూహ రచనలో బండి సంజయ్ ... ఖమ్మంపై కమలనాధుల ఫోకస్
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఇంట్లోనే బీజేపీ నేత మర్డర్
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బిజెపి నాయకుడు నేలవెల్లి రామారావుపై అగంతకులు దాడికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం రామారావు ఇంట్లోకి బైక్ పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రామారావు పై కత్తులతో దాడి చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు . రామారావుపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన వారు అక్కడ నుండి పరారయ్యారు . ఊహించని విధంగా జరిగిన దాడిలో రామారావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ తీవ్ర గాయాలపాలైన రామారావు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మున్సిపల్ ఎన్నికలకు ముందు బీజేపీ నేత మర్డర్ తో ఉద్రిక్తత
దీంతో ఖమ్మంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లాలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రామారావు బీజేపీలో ఆర్టీఐ సెల్ కన్వీనర్ గా పని చేస్తున్నారు . మరో మూడు నెలల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ నేత హత్య జరగడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
ఆర్ధిక లావాదేవీలే రామారావు మర్డర్ కు కారణం .. ప్రాధమిక దర్యాప్తులో తేలిందిదే
అయితే ఆర్థిక లావాదేవీల కారణంగానే రామారావు పై దాడి జరిగినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు గా సమాచారం. దాడికి పాల్పడిన నిందితుడు మాడపాటి రాజేష్ మధిర కోర్టులో లొంగిపోయినట్లు గా సమాచారం. ఇంకో ఆగంతకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు వీరు ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలో హత్య చేశారా ? లేకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.