మంచిదే కానీ: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై జేపీ, కోదండరాం, 'మత రిజర్వేషన్లు ఉండాలి, పేదలకు వద్దా'
హైదరాబాద్: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం, నష్టం జరగకుండా అగ్రవర్ణంలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించనుంది. దీనిపై ఆర్ కృష్ణయ్య, కోదండరాం, జయప్రకాశ్ నారాయణ వంటి వారు మాట్లాడారు. కొందరు దీనిని విమర్శించగా, మతపరమైన రిజర్వేషన్లు ఉండవచ్చు కానీ, పేదవారికి ఉండవద్దా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.
కేంద్రం సంచలన నిర్ణయం, అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు! కేబినెట్ ఆమోదం
మంచిదే కానీ సాధ్యమయ్యే పని కాదు
అగ్రవర్ణ రిజర్వేషన్ల నిర్ణయం మంచిదే కానీ, సాధ్యమయ్యే పని కాదని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం సోమవారం అన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలు ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇబ్బందే అన్నారు. రాజ్యాంగ సవరణ చేస్తే చేయవచ్చునని చెప్పారు. కానీ ఇప్పటికి ఇప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లపై రాష్ట్రాల అభిప్రాయం కూడా ఉండాలని చెప్పారు. ఇది అమలు చేయాలంటే ఈ మూడు నెలల సమయం సరిపోదని చెప్పారు. ఇది రాజకీయంగా లబ్ధి పొందేందుకు తీసుకున్న నిర్ణయం అన్నారు. ఈబీసీలపై చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు.
మోడీకి దమ్ముంటే దామాషా ప్రకారం
అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదని చెప్పారు. రిజర్వేషన్లను అరవై శాతానికి పెంచుతామంటే ఊరుకునేది లేదని చెప్పారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల పైన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీకి దమ్ముంటే దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు 53 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఎన్నికల జిమ్మిక్కు
ఈబీసీలకు రిజర్వేషన్ ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఎలా సాధ్యం అవుతుందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. 2014లో ఎన్నికైన వెంటనే రిజర్వేషన్ల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
మత రిజర్వేషన్లు ఉండాలి, పేదలకు వద్దా
రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అగ్రవర్ణాల పేదల కోసం మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రిజర్వేషన్లు ఇవ్వాలా లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలను రద్దు చేసి, మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ఈ బిల్లును (అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు) అడ్డుకుంటే పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వవచ్చు కానీ అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వవద్దా అని ప్రశ్నించారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఎలా అంటారన్నారు. దీనిపై అసదుద్దీన్, కోదండరాంలు సమాధానం చెప్పాలన్నారు. రిజర్వేషన్లు పెంచడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు.
మంచి పరిణామం
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఆహ్వానించదగ్గ పరిణామం అని లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ అన్నారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కేంద్రం ఎలా కల్పిస్తుందో చూడాలన్నారు. రిజర్వేషన్ పరిమితి 50 శాతంగా ఉందని గుర్తు చేశారు. ఉన్న రిజర్వేషన్లలో 10 శాతం తగ్గించి అగ్రవర్ణాలకు ఇస్తారా చూడాలన్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న వారిలో నిజమైన పేదలకు ఫలాలు అందడం లేదన్నారు. రిజర్వేషన్లు పొందుతూ ఓ స్థాయికి ఎదిగిన తర్వాత సామాజిక బాధ్యతగా రిజర్వేషన్ వదులుకోవాలన్నారు. దేశంలో ప్రభుత్వ విద్య దారుణంగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నారు. కులాల ప్రాతిపదిక ఆధారంగా ప్రతిభను గుర్తిస్తామని చెప్పడం సరికాదన్నారు.