మంచిపని: పనామా పేపర్స్పై జేపీ, ఐశ్వర్య వంటి 'పద్మ'లు కూడానా!
హైదరాబాద్: 'పనామా పేపర్స్' పైన లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం నాడు స్పందించారు. ఇప్పుడు బయటపడ్డ వివరాలు కేవలం శాంపిల్ మాత్రమేనని, ఈ రహస్యం బయటకు చెప్పి ప్రపంచానికి ఎంతో మేలు చేశారని జెపి అన్నారు.
విదేశీ రహస్య ఖాతాల్లో భారతీయులకు 700 బిలియన్ డాలర్ల పై చిలుకు డబ్బు ఉందని, పనామాలోని మొసాక్ ఫొన్సెకా నుంచి ఇప్పుడు బయటపడ్డ బ్లాక్ మనీ కేవలం కొద్దిగా మాత్రమేనని అన్నారు. పనామా పత్రాలను బయటపెట్టిన వారిని ఆయన ప్రశంసించారు.
ఇక మీద దేశం నుంచి డబ్బు చట్ట విరుద్ధంగా బయటికి పోకుండా ఉండాలన్నారు. విదేశాలలో మూలుగుతున్న 700 బిలియన్ డాలర్ల బ్లాక్ మనీతో పాటు మన దేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో ధనం వృథాగా పడి ఉందని చెప్పారు.
పనామా లిస్టులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ల పేర్లు కూడా ఉన్నాయి. ఇది అందర్నీ షాక్కు గురి చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఐశ్వర్య తరఫు ప్రతినిధి స్పందించారు. అమితాబ్ కూడా స్పందించారు. తనకు ఇతర దేశాల్లో ఎలాంటి కంపెనీలు లేవని చెప్పారు.
మీడియా పేర్కొన్న విదేశీ కంపెనీల్లో నేను ఎప్పుడూ డైరెక్టర్గా లేనని, బహుశా ఎవరైనా తన పేరును దుర్వినియోగం చేసి ఉండవచ్చుని, దేశంలో పన్నులు చెల్లించిన తర్వాతే చట్టబద్ధంగా ఎల్ఆర్ఎస్కు లోబడి విదేశాల్లో పెట్టుబడులు పెట్టానని చెప్పారు. నేను చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు ఆ కథనాల్లో రాలేదన్నారు.
పద్మా అవార్డు గ్రహితలా: శరద్ యాదవ్
జెడేయీ చీఫ్ శరద్ యాదవ్ మంగళవారం పనామా పేపర్స్ విషయమై స్పందించారు. బ్లాక్ మనీ లిస్టులో పద్మా అవార్డు గ్రహీతలు ఉండటం విడ్డూరమన్నారు. పద్మా అవార్డు గ్రహీతలు ఉండటం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు. కాగా, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య తదితరులు పద్మా అవార్డు గ్రహీతలు అనే విషయం తెలిసిందే.