తగ్గని జూడాలు: పిలిచినా రాలేదన్న రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పీహెచ్సీలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించిన డాక్టర్లను పర్మినెంట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పీహెచ్సీలు అవసరమో గుర్తించాలన్నారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే సమ్మె తప్పదని జూడాలు హెచ్చరించారు.
మరోసారి చర్చలకు పిలిచినా జూనియర్ డాక్టర్లు రాలేదని రాజయ్య అన్నారు. సోమవారంనాడు మరోసారి చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. గ్రామాల్లో సేవలను అందించడానికి తాము సిద్దంగా లేమని జూడాలు అంటున్నారని, దాన్ని ప్రభుత్వం అంగీకరించబోదని అన్నారు. ఎవరి ప్రోద్బలంతో వారు ఆందోళన చేస్తున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగానే ఉందని డిప్యూటీ సిఎం రాజయ్య చెప్పారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో వారు ఈ ఆందోళన సాగిస్తున్నారు. తాము అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని జూనియర్ డాక్టర్లు శనివారంనాడు హెచ్చరించారు. జూనియర్ డాక్టర్లు బాధ్యతలు మరిచి హక్కుల గురించే మాట్లాడుతున్నారని రాజయ్య విమర్శించారు.
ఇదిలావుంటే, సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, శానససభ్యుడు శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. నాయిని ఆరోగ్యం గురించి వారు అడిగి తెలుసుకున్నారు.