సుహాసినికి ప్రచారంపై జూ.ఎన్టీఆర్ డైలమా, కారణమిదేనా? 'ఏపీపై కేసీఆరే యూటర్న్ తీసుకున్నారా'
హైదరాబాద్: మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత నందమూరి సుహాసిని తరఫున నందమూరి కుటుంబం నుంచి పలువురు ప్రచారంలో పాల్గొంటున్నారు. నందమూరి తారకరత్న, కళ్యాణ్ రామ్ సతీమణి, జానకీరాం సతీమణి, నందమూరి బాలకృష్ణ తదితరులు రోడ్డు షోలు, ఇంటింటికి తిరుగుతున్నారు.
జూ.ఎన్టీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని గతంలో ప్రచారం సాగింది. అయితే ఆయన రాకపై ఇప్పటికీ తేలలేదు. సుహాసిని ప్రచారానికి ఆయన వస్తారా లేదా అనే చర్చ అభిమానుల్లో, టీడీపీ కార్యకర్తల్లో సాగుతోంది. ఆయన ప్రచారంపై నేడు (ఆదివారం) నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
జూ.ఎన్టీఆర్ డైలమాలో ఉన్నారా?
ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. రాజమౌళి నిర్మిస్తున్న చిత్రీకరణలో ఉన్నందున ప్రచారంపై స్పష్టత రాలేదు. ఈ నెల 1వ తేదీ తర్వాత ఆయన కూకట్పల్లిలో పర్యటిస్తారని టీడీపీ నేతలు చెప్పారు. అయితే జూ.ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొంటారని ఎక్కడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీనిపై అయోమయం నెలకొంది. ఆదివారం నిర్ణయించే అవకాశముంది. కాగా, కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై జూ.ఎన్టీఆర్ డైలమాలో ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
ఆ తర్వాతే ఆదాయం
కాగా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ రాజకీయాల్లో హుందాతనం పాటించడం లేదని, సైబారాబాద్ను నేనే నిర్మించానని, హైటెక్ సిటీని నేనే కట్టానని చంద్రబాబు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయాలను ప్రారంభించానని చెప్పారు. నగరానికి కృష్ణా జలాలు తెచ్చానని చెప్పారు. బిల్ క్లింటన్ను తీసుకు వచ్చి సైబరాబాదుకు నామకరణం చేశానని, ఆ తర్వాతే సేవల రంగం నుంచి 64 శాతం ఆదాయం వస్తోందన్నారు.
కేసీఆర్పై ఉన్న సీబీఐ కేసును ఎత్తివేశారు
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్తో టీడీపీ పోరాటం చేసిందని చంద్రబాబు చెప్పారు. కానీ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నరేంద్ర మోడీ చెప్పిన అచ్చేదిన్ రాలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల రాష్ట్రంగా మార్చిన చిన్న మోడీ కేసీఆర్ను ఓడించాలన్నారు. మోడీ, కేసీఆర్ ఒక్కటే అన్నారు అందుకే కేసీఆర్పై ఉన్న సీబీఐ కేసును ఎత్తివేశారని చెప్పారు.
కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు
తాను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్ మాట మార్చారన్నారు. ఏపీకి హోదా ఇస్తే నష్టం లేదని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారని చెప్పారు. అటు మోడీ ఇటు కేసీఆర్ దారుణంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన అక్కడ పని చేయడని, ఈయన ఇక్కడ పనిచేయడన్నారు. హైదరాబాదులో తాను ప్రతి గల్లీ తిరిగానని చెప్పారు. నరేంద్ర మోడీ తమతో పెట్టుకుంటే వదలమని చెప్పారు.