మా అక్క ప్రజా సేవ చేసేందుకు మీ మధ్యకు వస్తోంది...ఆశీర్వదించండి: జూనియర్ ఎన్టీఆర్
Recommended Video
నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దిగుతున్నారు. ఆమె కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈరోజు నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు మంచి నిర్ణయం తీసుకుని నేడు నామినేషన్ వేయనున్న తన సోదరి సుహాసినిగారికి అభినందనలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
మరోవైపు మరో సోదరుడు హీరో కళ్యాణ్ రామ్ కూడా సుహాసినికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఆ పార్టీ తమకు ఎంతో పవిత్రమైనదని ఎన్టీఆర్ కళ్యాణ్రామ్లు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన తండ్రి హరికృష్ణ సేవలను కూడా గుర్తు చేసిన సోదరులు తన సోదరిని కూడా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అంతేకాదు మహిళలు సమాజంలో ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం తమదని నందమూరి సోదరులు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు సేవచేసేందుకు సిద్ధ పడుతున్న సుహాసినిగారికి విజయం వరించాలని ఆకాంక్షించారు.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018
అనేక నాటకీయ పరిణామాల మధ్య కూకట్పల్లి నియోజకవర్గం టికెట్ నందమూరి సుహాసినికి దక్కింది. ముందుగా టీడీపీ నేత పెద్దిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. తను ప్రచారాన్ని కూడా ఇక్కడ మొదలు పెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం టికెట్ను నందమూరి ఫ్యామిలీకి కేటాయించాలని భావించారు. ఇందులో భాగంగానే ముందుగా హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ భార్యను బరిలోకి దింపనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారన్న వార్తలు కూడా షికారు చేశాయి. అయితే వీరిద్దరూ ఆసక్తి చూపకపోవడంతో సుహాసినిని పోటీకి దించుతోంది తెలుగుదేశం పార్టీ.
All the best Suhasini Akka for your new journey! pic.twitter.com/cBK1B4iL7i
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 17, 2018