అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే విష్ణు... ముందస్తు బెయిల్ మంజూరు
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, ఆయన అంగరక్షకుడిపై దాడి చేసిన కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిని ఎలాగైనా శుక్రవారం అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
నిన్న సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు ఇంటికి వెళ్లగా, విష్ణు తన రెండు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి... అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని తన స్నేహితుని ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే, రంగారెడ్డి కోర్టులో విష్ణు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. విష్ణుకు బెయిల్ రాకుంటే, ఆయన పరారీలో ఉన్నట్టు ప్రకటించి, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు. ఈ నెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికి బెయిల్ మంజారు
మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ని విచారించిన తర్వాత విష్ణు వర్ధన్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు ఉదయం విష్ణు బెయిల్కు సంబంధించి వాదనలు జరిగినా.. న్యాయమూర్తి తన నిర్ణయాన్నిమధ్యాహ్నానికి వాయిదా వేశారు.
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై విష్ణు, మరికొందరు దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను అడ్డుకునే యత్నం చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణుకు బెయిల్ మంజూరు చేసింది.