హీరో ఉదయ్ కిరణ్ పని అయిపోయినట్టే?: పీడీ చట్టం కింద కేసు నమోదు
హైదరాబాద్: పలు నేరాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సినీ హీరో నండూరి ఉదయ్కిరణ్పై మొదటిసారి జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే గత నెలలో జూబ్లిహిల్స్లోని దసపల్లా హోటల్లోకి ప్రవేశం నిరాకరించినందుకు సిబ్బందిపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో, కాకినాడ, మాదాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సినీ హీరో నండూరి ఉదయ్కిరణ్పై జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అద్దాలు ధ్వంసం, బీభత్సం: పబ్పై దాడి చేసిన హీరో ఉదయ్ కిరణ్ అరెస్ట్
స్నేహితుడిని బెదిరించి కారును తీసుకువెళ్లడం, పబ్లో గొడవలో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడడంతోపాటు రాజమండ్రిలోనూ పలు కేసులు ఇతడిపై ఉన్నాయి. దీంతో ఉదయ్కిరణ్పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపారు. ఈ చట్ట ప్రకారం ఆయన ఏడాదిపాటు జైలులోనే ఉండాల్సి వస్తుంది.
చంచల్ గూడ జైలులో ఉన్న ఉదయ్కిరణ్కు శనివారం నోటీసులు అందించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. మాదాపూర్ ఫార్చూన్ టవర్స్లో నివసించే ఉదయ్కిరణ్ది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీలోని కమలాదేవి వీధి గాంధీనగర్. సినిమాలపై మోజుతో నగరానికి వచ్చి మూడు సినిమాల్లో హీరోగా నటించాడు.
అయితే డ్రగ్స్కు అలవాటు పడిన ఉదయ్ కిరణ్ తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తల్లి హైదరాబాద్లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో హెడ్నర్స్గా పని చేస్తున్నారు. అమ్మాయిలతో జల్సాలు, డ్రగ్స్, మద్యం, పబ్లు, జూదానికి అలవాటుపడ్డ ఉదయ్కిరణ్ మొత్తం 10 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.