ఎఎస్ఐ సంపాదన వంద కోట్లా: న్యాయమూర్తి విస్మయం
హైదరాబాద్: వడ్డీ వ్యాపారం ద్వారా కరీంనగర్ ఎఎస్ఐ బొబ్బల మోహన్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామిరెడ్డి ద్వారా తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. బొబ్బల మోహన్ రెడ్డికి హైకోర్టు సోమవారంనాడు బెయిల్ నిరాకరించింది.
పోలీసుగా ఉంటూ భారీ మొత్తాలను వడ్డీలకు తిప్పుతుండడమే కాకుండా వడ్డీ కోసం తీవ్రమైన ఒత్తిడి పెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యాడని మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. బెయిల్ కోసం మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ రాజా ఇలంగో సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్కు చెందిన కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు మోహన్ రెడ్డి వద్ద 75 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఇందులో రూ.50 లక్షలు తిరిగి చెల్లించారు. మిగిలిన మొత్తం విషయంలో వడ్డీ కోసం ప్రసాదరావుపై మోహన్ రెడ్డి ఒత్తిడి పెట్టాడు. దీంతో ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు.
మోహన్ రెడ్డి, తదితరులు తన ఆత్మహత్యకు బాధ్యులని ప్రసాదరావు తన సూసైడ్ నోట్లో ఆరోపించారు. దీనిపై ప్రసాదరావు భార్య గౌతమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది. బెయిల్ మంజూరు చేసేందుకు కింది కోర్టు అంగీకరించకపోవడంతో మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.