3 నుంచి గ్రేటర్లో కఠినంగా లాక్డౌన్...? 2న మంత్రివర్గ సమావేశం..? పగటిపూట కూడా కర్ఫ్యూ
గ్రేటర్ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య డేంజర్ బెల్స్ మోగిస్తోంది. యావరేజీగా 1000 వరకు రికార్డవుతోన్న కేసుల్లో భాగ్యనగరానిదే సింహభాగం. ఈ క్రమంలో సిటీలో మరోసారి లాక్డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల సీఎం కేసీఆర్ సూచనప్రాయంగా తెలిపారు. జూలై 2వ తేదీన గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. గ్రేటర్ పరిధిలో కఠినంగా లాక్డౌన్ విధిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది అని, 15 రోజులు లాక్డౌన్ విధించాలని వైద్యారోగ్యశాఖ సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించింది. దానిని ప్రాతిపదికన తీసుకొని.. జీహెచ్ఎంసీ నిర్బంధంలోకి వెళ్లనుంది.
Coronavirus: చెప్పింది చెయ్యండి, చరిత్ర అడగద్దు, మంత్రి ఫైర్: మేకలకు క్వారంటైన్, కరోనా పరీక్షలు !
పగటిపూట కూడా కర్ఫ్యూ..
గురువారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని.. శుక్రవారం నుంచి లాక్డౌన్ అమలు చేయబోతున్నారు. గ్రేటర్ పరిధిలో అత్యంత కఠినంగా అమలు చేస్తారని తెలుస్తోంది. ఇదివరకటీ లాగా రాత్రి పూట కాకుండా, మధ్యాహ్నం కూడా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. పాలు, కూరగాయాలు, మందుల కోసం కేవలం 2 గంటలే అనుమతి ఇస్తారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత రోడ్డు మీద కనిపించొద్దు అని.. ఆగుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసే అవకాశం ఉంది.
95 శాతం గ్రేటర్లోనే
మాస్క్లేకుండా ఇంటినుంచి బయటకు రావద్దు.. గుంపులుగా ఉండొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. కానీ, ప్రజలు మాత్రం అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. రావడమే గాక మాస్క్ ధరించడం మానివేసి, భౌతిక దూరం నిబంధనను కూడా గాలికొదిలేశారు. సిటీలోని కొన్ని మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోయి కనిపించాయి. రద్దీ పెరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నెల 27న ఏకంగా 1,087 కేసులు నమోదయ్యాయంటటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 95 శాతానికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. కేసుల తీవ్రతను తగ్గించాలంటే మళ్లీ లాక్డౌన్ విధించడమే తప్ప మరో పరిష్కారం లేదు.
స్వచ్చందంగా..
సిటీలో వైరస్ వ్యాపించడంతో బేగంబజార్, జనరల్ బజార్ వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పలు కాలనీలు కూడా లాక్డౌన్ అమలు చేసుకుంటున్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేస్తున్నారు. కానీ బయటకు వెళ్లేందుకు/వచ్చేందుకు ఒక మార్గాన్ని మాత్రమే తెరుస్తున్నారు. కానీ అందుకు నిర్దేశిత సమయం అనే గడువు విధించారు. కొన్నిచోట్ల కాలనీలో గల వాహనాలకు స్టిక్కర్లు, ప్రత్యేక నంబర్లు కేటాయించి.. మినహా మిగతావాటిని అనుమతించడం లేదు.
మేం రె‘ఢీ'
జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ కట్టడిచేస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. లాక్ డౌన్ గురించి సీఎం కేసీఆర్ ఏ సమయంలో ప్రకటించినా పక్కాగా అమలుచేసేందుకు అన్నిశాఖలు అప్రమత్తమవుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో బారికేడింగ్, ఇతర భద్రతాపరమైన చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు డిస్కస్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51(బీ) కింద కేసులు నమోదుచేసే అవకాశం ఉంది. మాస్క్ ధరించకుండా, వ్యక్తిగత దూరం పాటించనివారిపై ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించి చర్యలు తీసుకుంటారు. ఇదివరకు లాక్డౌన్ విధించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 1.81 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Recommended Video
గ్రామాలు కూడా..
హైదరాబాద్లోని పలుప్రాంతాల్లోని మార్కెట్లు స్వయంగా లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఇదీ జిల్లాల్లోని పట్టణాలకు చేరింది. అటు నుంచి గ్రామాలకూ కూడా పాకింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా వ్యాపార కార్యకలాపాలు నడిచేలా.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా పంచాయతీ పెద్దలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిర్ణీత సమయం వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చి.. చీకటి పడగానే లాక్డౌన్ పాటిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాలకు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు.