4న స్థానిక ఓట్ల లెక్కింపు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక .. ప్రమాణం మాత్రం జూలైలోనే .. ఎందుకంటే ?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు కొనసాగిన సస్పెన్స్ వీడింది. వచ్చే నెల 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పస్టంచేసింది.
27న కానీ ...
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎంపికను జూలైలో నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. దాదాపు 40 రోజుల సమయం ఉండటంతో ప్రలోభాలకు తెరలేస్తుందని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ నెల 27న లెక్కించాల్సిన ఓట్ల ప్రక్రియను వాయిదా వేసింది. తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది.
పదవీకాలం ముగియలేదు
వాస్తవానికి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగియలేదు. అందుకోసమే జూలై 5న ఎంపిక ప్రక్రియ చేపడుతామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలుపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేసింది. ఈ సవరణ ప్రకారం సభ్యుల ఫలితాలను ప్రకటించే వెసులుబాటు ఉంది. దీంతోపాటు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ కూడా ఎన్నుకోవచ్చు. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం జూలై 5 తర్వాతే చేయాల్సి ఉంటుంది. 2018 చట్ట సవరణ ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ను మాత్రం ఎన్నుకునే వెసులుబాటు లేదు. దీంతో ప్రభుత్వం చట్టానికి సవరణ చేసింది.
చట్ట సవరణ
2018 పంచాయతీ రాజ్ చట్ట సరవణ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. దీని ప్రతీని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం అందజేసింది. దీంతో ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతామని పేర్కొంది. తర్వాత ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటామని స్పష్టంచేసింది. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం జూలై 5 తర్వాత చేయాల్సి ఉంటుందని తెలియజేసింది.