జూ.డాల ఆందోళన చిన్నారి ప్రాణం తీసిందా? బాధ్యులెవరు జూ.డా లా , ప్రభుత్వమా ?
వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దైవంతో సమానం. అటువంటి వైద్యవృత్తిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాణాలు కాపాడటానికి వైద్యులు పని చేయాలి. కానీ మీ ప్రాణాల విషయం తర్వాత, ముందు మా డిమాండ్స్ ముఖ్యం అన్న చందంగా చేసిన జూనియర్ డాక్టర్లు ఆందోళన ఓ చిన్నారి ప్రాణం తీసింది. చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వచ్చిన ఎందరో వ్యాధి బాధితులను ఇబ్బందులకు గురి చేసింది. కళ్లెదురుగా ప్రాణాలకోసం తల్లడిల్లుతున్నా కనికరం లేకుండా చేసింది.
జూడాల ఆందోళన సరే ... చిన్నారి ప్రాణం మాటేంటి
తమకు ఆస్పత్రులలో రక్షణ కల్పించాలని, దాడుల నుండి తమని కాపాడాలని విధులను బహిష్కరించి మరీ ఆందోళన చేసిన జూనియర్ డాక్టర్లు ఓ ప్రాణం పోవడానికి కారణమయ్యారు. ప్రాణాల కంటే డిమాండ్స్ ముఖ్యమా అని సమాజం ప్రశ్నిస్తోంది.
తమపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జూడాలు సమ్మెకు దిగారు . ఆసుపత్రిలో రక్షణ కల్పించాలని ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన బాట పట్టారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంతమాత్రంగా కొనసాగాయి. జూనియర్ డాక్టర్లు నిర్వహిస్తున్న సమ్మెపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జూనియర్ డాక్టర్ల తో చర్చలు జరిపారు. మార్చి 11 లోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా జూనియర్ డాక్టర్ల సమ్మెతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన రోగులు విలవిలలాడారు. పట్టించుకునేవారు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్నారి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
జూడాల ఆందోళనతో సకాలంలో అందని వైద్యం .. చిన్నారి మృతి
మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సతీష్ దంపతుల రెండేళ్ల కుమారుడు స్టీఫెన్ జారిపోయి సంపులో పడిపోయాడు. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులిద్దరూ కొనప్రాణంతో ఉన్న చిన్నారిని బైక్ పై ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని,గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించడంతో అక్కడికి వెళ్లారు.జూడాల ఆందోళన కారణంగా పోలీసులు హాస్పిటల్ ప్రధాన ద్వారాలన్నీ మూసివేశారు. అయితే అప్పటికే చిన్నారి నోటి నుంచి నురుగ రావడంతో ఆ తల్లి రెండు గేట్ల దగ్గరకు వెళ్లి తీయాలని సిబ్బందిని ప్రాధేయపడింది. ఎవ్వరూ స్పందించకపోవడంతో చివరికి ఓపీలోని ఎమర్జెన్సీ గేటు ద్వారా వెళ్లి డాక్టర్లకు చూపించగా చిన్నారి అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. తమ చేతిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంపై చిన్నారి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
బాలుడు సందీప్ మృతితో డాక్టర్ పై దాడి ... జూడాల ఆందోళనకు కారణమిదే
వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సీతాఫల్మండి రవీంద్రనగర్కు చెందిన సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు గాంధీ ఆస్పత్రికి చెందిన ఓ జూనియర్ డాక్టర్పై దాడికి పాల్పడ్డారు. వైద్య సిబ్బందిని దుర్భాషలాడారు. ఆస్పత్రి అద్దాలు, ఫర్చీచర్ ధ్వంసం చశారు. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. స్వరాష్ట్రంలోనే తమకు భద్రత కరువైందని జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. జూనియర్ డాక్టర్ల ఆందోళన ప్రభావం ఆసుపత్రికి వచ్చిన రోగుల పైన బాగా పడింది. ఒక చిన్నారి ఆందోళన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చారు.
ఈ ఘటనకు బాధ్యులెవరు.. జూనియర్ డాక్టర్లా ... ప్రభుత్వమా
ఒక చిన్నారి నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది జూనియర్ డాక్టర్లా... లేక ప్రభుత్వమా? రోగులు ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అహర్నిశలు పని చేస్తారు. అయితే అటువంటి డాక్టర్ల పై దాడులు చేయడం అందరూ ఖండించాల్సిన విషయమే. డాక్టర్ల పైన దాడులు జరగకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులను నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చికిత్స అందించాల్సిన బాధ్యత డాక్టర్ల పైన కూడా ఉంది. ఇక ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి తాలూకా బంధువులు మరణించిన వారు ఎలా చనిపోయినా దానికి డాక్టర్లని బాధ్యుల్ని చేయడం కూడా సమంజసమైన విషయం కాదు. ప్రభుత్వ పట్టింపులేని తనం, డాక్టర్ల నిర్లక్ష్యం, ఆసుపత్రులకు వచ్చే కొందరు రోగుల తాలూకు బంధువుల అసహనం తో కూడిన బాధ్యతారాహిత్యం వెరసి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.