నేను కాంగ్రెస్లో ఉండగా: జూపల్లి ఆసక్తికరం, రేపు మోడీతో కేసీఆర్ భేటీ
నల్గొండ: తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ తరహా పాలన సాగలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆదివారం అన్నారు. మరో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించారు.
మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు గుండాల మండలం అనంతారంలో సీసీ రోడ్డు పనులకు, గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటి నీళ్లు పోశారు. గుండాల మండలం సుద్దాలలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
కాగా, వరంగల్లోని కాకతీయ వర్సిటీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ మధుసూధనా చారి, మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిచబోతున్నారన్నారు. ప్రతీ ఒక్కరు హరితహారంలో పాల్గొని పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.
రేపు ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అంతర్రాష్ట మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సీఎం రేపు ప్రధాన మంత్రి మోడీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు మోదీతో సమావేశమవుతారు. హైకోర్టు విభజన, ఆంధ్రా న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించడం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.