డోలాయమాన స్థితిలో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ .. జూపల్లి కారు దిగి కాంగ్రెస్ కు జై కొడతారా ?
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా ? మున్సిపల్ ఎన్నికలలో ఆయన వేసిన స్టెప్ ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టిందా ? సీఎం కేసీఆర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూపల్లి మీద గుర్రుగా ఉన్నారా ? ఇటీవల తాను గెలిపించిన రెబల్ వర్గాన్ని పక్కన పెట్టింది జూపల్లిని పొమ్మనకుండా పొగ పెట్టటానికేనా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
టీఆర్ఎస్ లో ప్రాధాన్యత కోల్పోయిన జూపల్లి
మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత గతంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు జూపల్లి కృష్ణారావుకు ఇప్పుడు గులాబీ గూటిలో ఉండలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు పార్టీలో ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ఇక ఇదే సమయంలో కొల్లాపూర్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కడంతో జూపల్లి డమ్మీ అయిపోయారు. ఇక తన సత్తా అధిష్టానానికి చూపించి తిరిగి కీలకంగా మారాలనుకున్న ఆయన చేసిన పని పార్టీలో ఇప్పుడు కొనసాగలేని స్థితి తెచ్చి పెట్టింది .
మున్సిపల్ ఎన్నికల్లో తిరుగుబాటు ఫలితం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో ఎమ్మెల్యేగా ఓటమిపాలైన జూపల్లి పోయిన తన ప్రతిష్టను తాజా మున్సిపల్ ఎన్నికలతో తిరిగి నిలబెట్టుకున్నాడు . కానీ అదే ఆయనకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గానికి కాకుండా , పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గానికి టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చారు . దీతో తన వర్గానికి అన్యాయం జరిగిందని భావించిన జూపల్లి విధిలేని పరిస్థితుల్లో జూపల్లి టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటే ఇప్పుడు ఆయనకు చేటు చేసింది.
తన వర్గం నుండి 11 మందిని రెబల్స్ గా గెలిపించిన జూపల్లి
తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ రెబల్స్ గా పోటీచేసి 11 మందిని గెలిపించాడు. కానీ కొల్లాపూర్ మునిసిపాలిటీలో సత్తా చాటాడు . ఇక్కడ అధికార టిఆర్ఎస్ కేవలం 9 సీట్లే గెలుచుకుంది . కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కంటే తనకే ప్రజాదరణ ఉందని, అలాంటి తనను గుర్తించాలని మున్సిపల్ ఎన్నికల ద్వారా కెసిఆర్ కెటిఆర్లకు సంకేతం ఇచ్చారు జూపల్లి కృష్ణారావు .
జూప్లలిని, ఆయన వర్గాన్ని పక్కన పెట్టిన కేసీఆర్ , కేటీఆర్ లు
అయితే కేసీఆర్, కేటీఆర్ లు మాత్రం జూపల్లి చేసిన పనికి ఆయన మీద బాగా గరంగానే ఉన్నారు . దీంతో వారు జూపల్లికి షాకిచ్చారు. తిరుగుబాటు చేసిన జూపల్లి వర్గం అయిన 11 మంది తిరుగుబాటుదారుల మద్దతును తీసుకోవాలని కేసీఆర్ ను కోరినా తిరస్కరించారు . దీంతో జూపల్లి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది . ఎక్స్-అఫిషియో సభ్యులతో కొల్లాపూర్ మున్సిపాలిటీని కేసీఆర్ గెలుచుకున్నారు. ఈ విధంగా 11 సీట్లు గెలిచినప్పటికీ జూపల్లి వర్గం మున్సిపాలిటీని గెలుచుకోలేదు.
సొంత గూడు కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి యోచన
అటు అధికార టీఆర్ఎస్ లో ఆయనకు, ఆయన వర్గానికి తలుపులు క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. తాము టీఆర్ఎస్ లో చేరుతామని జూపల్లి ఇటీవల కెసిఆర్ అపాయింట్మెంట్ కోరినప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఇప్పుడు గందరగోళంగా మారింది. ఇక బీజేపీలోకి వెళ్లేందుకు ఆయనకు ఆసక్తి లేదు. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి జూపల్లి తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి జూపల్లి కృష్ణారావు ఏం చెయ్యనున్నారో !!