నేను తెలంగాణ నీరవ్ మోడీనా, పరువు నష్టం దావా, క్రిమినల్ కేసు వేస్తా: జూపల్లి
హైదరాబాద్: తమను తెలంగాణ నీరవ్ మోడీ అని విమర్శించడం దారుణం అని, తమపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు పెడతానని జూపల్లి కృష్ణారావు బుధవారం వెల్లడించారు. జూపల్లి తనయుడు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టారని, వారికి సీబీఐ నోటీసులు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకు రుణాలు తీసుకోవడం సహజమన్నారు. అప్పు చేసి వ్యాపారం చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమను తెలంగాణ నీరవ్ మోడీ అని పిలుస్తారా అని మండిపడ్డారు. నా మీద గెలవలేక నా పిల్లలపై పడతారా అన్నారు.
రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమకు నోటీసులు అంటూ చెప్పారని, కానీ ఫేక్ నోటీసులు సృష్టించారన్నారు. తీసుకున్న అప్పులో రూ.31 కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు. అప్పు చేశాం తప్ప తప్పు చేయలేదన్నారు.
అసలు తన కొడుకు అరుణ్కు సీబీఐ నోటీసులే రాలేదన్నారు. తమపై బురద జల్లేందుకు అవాస్తవాలు రాస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తన కొడుకు తన సొంత కాళ్లపై నిలబడటం చూసి తాను గర్వంగా ఉన్నానని చెప్పారు. చట్టపరంగా తాము న్యాయం చేస్తున్నామన్నారు.
తెలంగాణ కోసం తాను పదవులు వదులుకున్నానని చెప్పారు. ఫ్రుడెన్షియల్ బ్యాంకులో రూ.6 కోట్లు అప్పు తీసుకొని వడ్డీతో సహా చెల్లించామన్నారు. తాము తీసుకున్న అప్పులకు గ్యారెంటీ ఉందని, వాటిని బ్యాంకులు వసూలు చేస్తాయన్నారు. తమపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు పెడతానని చెప్పారు. నేను సంపాదించుకున్న మంచి పేరును అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.