త్రీఇడియట్స్: డీకే అరుణ, నాగం, రేవంత్లను ఏకేసిన జూపల్లి
మహబూబ్నగర్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలపై తెలంగాణ రాష్ట్రమంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరును సస్యశ్యామలం చేసే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు వీరు ముగ్గురు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
గురువారం మహబూబ్నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునే కుట్ర జరుగుతోందన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు, ఎందుకు పాలమూరు ఎత్తిపోతల వంటి ప్రాజెక్టును చేపట్టలేదని ప్రశ్నించారు.
కేంద్రం కూడా ఆంధ్రా ప్రభుత్వం చెప్పినట్లే నడుస్తోందని, పాలమూరు ఎత్తిపోతలపై భారతీయ జనతా పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందంటే.. ఆ ప్రకారమే పరిహారం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జీవో 123 తో వచ్చే లాభాల కంటే తక్కువ వస్తే నష్టం భరిస్తారా? అని ప్రశ్నించారు.
జీవో 123తో రైతులు ఎలా నష్టపోతున్నారో లెక్క లు తయారు చేయాలని సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో ఓయూలో నాగంకు విద్యార్థులు దేహశుద్ధి చేస్తే తప్ప ఉద్యమబాట పట్టలేదని, ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఆయనకు ప్రజలు దేహశుద్ధి చేస్తేనే జ్ఞానోదయం కలుగుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఎద్దేవాచేశారు.
ఇది ఇలా ఉండగా, మరో మంత్రి లక్ష్మారెడ్డి భద్రాచలంలో మాట్లాడుతూ.. పాలమూరుపై పిల్ వేస్తే హైకోర్టులో చీవాట్లు పెట్టినా మార్పురాలేదని నాగంపై మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు ఆపడం ఎవరితరం కాదని జిల్లా ప్రజలే అవసరమైనప్పుడు బుద్ధిచెప్తారన్నారు. ప్రజలకు నీరందించే ప్రాజెక్టులకు అంతరాయం కలిగిస్తున్న నాగంకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.