బాబు అరెస్ట్: 'ఆయనకే చివరిరోజు, తెలంగాణ ప్రభుత్వానికి కాదు'
హైదరాబాద్: తనని అరెస్ట్ చేస్తే, తెలంగాణ ప్రభుత్వానికి అదే ఆఖరిరోజు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజముందని జూపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్ట్తో ఆయనకే చివరి రోజని, తెలంగాణ ప్రభుత్వానికి కాదని జూపల్లి స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంలో చేస్తున్న యాగీతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో హైదరాబాద్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి దాని ద్వారా చంద్రబాబు లబ్ధి పొందాలని యత్నిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక విధానం గురించి మాట్లాడారు.
తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రపంచ స్ధాయిలో ఉంటుందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా శుక్రవారం పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. పారిశ్రామిక అనుమతులన్నీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా నిర్దేశిత గడువులో అందించనున్నట్లు జూపల్లి తెలిపారు.