రేవంత్ అందుకే కాంగ్రెస్లో చేరారు: జూపల్లి తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి కాబట్టే పార్టీలు మారుతున్నారని జూపల్లి చెప్పారు. టీడీపీలో ఉంటే అస్సలు గెలవలేమనే టీడీపీ నేతలు పార్టీలు మారుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నేతలు చేరిన కారణం ఒకటైతే.. చెబుతున్నది మరొకటని జూపల్లి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు శిక్షణలో పెరిగిన సమర్థవంతమైన నాయకుడినంటూ రేవంత్ మాట్లాడుతున్నారని.. తెలంగాణ రావడాన్ని జీర్ణించుకోని టీడీపీలో రేవంత్ రెడ్డి తీసుకున్నాడా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాంతంలో కుట్రలు చేయడానికే రేవంత్ పార్టీ మారాడని జూపల్లి ఆరోపించారు.
చంద్రబాబు సమర్థుడని రేవంత్ మాట్లాడుతున్నారని.. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు చేసిందేమిటీ? అని మంత్రి నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో నాటకాలు ఆడారని, తెలంగాణ కోసం రాజీనామాలు కూడా చేయలేదని అన్నారు.
ముఖ్యమంత్రి పరిపాలనా విధానాన్ని చూసిన తరువాత టీడీపీ కనుమరుగు అయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు. గతంలోనే ఈ పార్టీల నేతలు కలిసి పోటీ చేశారని, ఇప్పుడు కొత్తగా కలిసి పోటీ చేసి గెలుస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
గొర్రెలు, బర్రెలు అంటూ మాట్లాడుతున్నారని, యాదవులు మనుషులు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హెరిటేజ్ను ఎలా నడిపిస్తున్నారని ప్రశ్నించారు. హెరిటేజ్లో ఉండేవి బర్రెపాలు కాదా? గాడిద పాలా? అని ఎద్దేవా చేశారు. గొర్రెలు, బర్రెలు అంటే యాదవులు, కురుమలు ఊరుకుంటారా? మీకు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఈ మూడున్నరేళ్లలో చేసింది ఏమిటని మాట్లాడుతున్నారని జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.