క్రీడల్లోలానే రాజకీయాల్లోనూ సైనా నెహ్వాల్ దూసుకెళ్తుంది: బీజేపీలో చేరికపై తల్లి ఉషారాణి హర్షం
న్యూఢిల్లీ: తన కూతురు క్రీడల్లో రాణించిన విధంగానే రాజకీయాల్లోనూ రాణిస్తుందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తల్లి ఉషారాణి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో సైనా నెహ్వాల్ తన సోదరితోపాటు కాషాయ కండువా కప్పుకున్నారు.
క్రీడల్లోలానే రాజకీయాల్లోనూ..
క్రీడల్లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన తన కుమార్తె తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించడంపై సైనా తల్లి ఉషారాణి హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్త బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె మీడిమాతో చెప్పారు. క్రీడల్లోసైనా బాగా ఆడుతూ మంచి ప్రతిభ కనబర్చిందని.. అలాగే రాజకీయాల్లోనూ అంతే బాగా రాణిస్తుందని అన్నారు. దేశ ప్రజలకు బీజేపీ ఎంతో మేలు చేస్తోందని ఆమె అన్నారు. సైనా నెహ్వాల్ ది కష్టపడే తత్వమని, రాజకీయ రంగంలోనూ ఆమె కష్టపడి పనిచేస్తుందని ఉషారాణి వ్యాఖ్యానించారు.
మోడీ నేతృత్వంలో పనిచేయాలనే..
కాగా, బీజేపీలో చేరిన సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. దేశం కోసం పనిచేసే బీజేపీలో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. కష్టపడేవారంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన సైనా నెహ్వాల్.. అందుకే దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరినట్లు సైనా తెలిపారు.
బీజేపీలో చేరడం గర్వంగా ఉంది..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని సైనా నెహ్వాల్ తెలిపారు. బీజేపీలో చేరినందుకు గర్వంగా ఉందని.. నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశానికి సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తానని సైనా అన్నారు.
తెలంగాణ బీజేపీకి కొత్త బలం
తెలంగాణకు చెందని క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్.. బీజేపీలో చేరడంతో రాష్ట్రంలో బీజేపీకి కొంత బలం చేకూరినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టిపెట్టిన పార్టీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్ ఇక బ్యాడ్మింటన్కు గుబ్ బై చెబుతుందా? లేక ఆటను కొనసాగిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.