కేటీఆర్ వద్దు.!ఈటలను సీఎం చేస్తేనే బీసీకు న్యాయం.!ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్.!
హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు గురించి వాడి వేడి చర్చ జరుగుతోంది. అధికార గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి రాజకీయ పార్టీలు అనేక రకాలుగా స్పందిస్తున్నాయి. అంతే కాకుండా తెలంగాణలో తదుపరి సీఎంగా కల్వకుంట్ల తారాక రామారావు రాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో 'తెలంగాణ ఇంటి పార్టీ' అధ్యక్షుడు, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ భావించారని, అందుకే తెలంగాణ కల సాకారం చేసారన్నారు సుధాకర్. కాగా దళితుడిని మొదటి సీఎం చేస్తానన్న చంద్రశేఖర్ రావు, తానే ఆ పదవిని అనుభవిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఇప్పుడు తన కుమారుడు తారక రామారావును సీఎం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అలా జరిగితే తెలంగాణ సమాజానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని సుధాకర్ స్పష్టం చేసారు.
ఇదిలా ఉండగా తారక రామారావు స్థానంలో ఈటల రాజేందర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తే తప్పేంటని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే, 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని, ఇప్పటివరకూ అది జరగలేదని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్టు అవాస్తవ ప్రచారాన్ని చేసుకుంటున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కాగా ఉద్యోగ కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతమాత్రమూ స్పష్టతలేదని వ్యాఖ్యానించిన సుధాకర్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కోదండరామ్ కు ఎన్డీయే నేతలు ఎందుకు మద్దతిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను కమ్యూనిస్టు ఉద్యమాల్లో తరచూ పాల్గొంటున్న వాడినని, తాను విజయం సాధిస్తే, విద్యావంతుల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు.