తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి: ఏపీకి జస్టిస్ అరుప్ గోస్వామి?
హైదరాబాద్/అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. తెలంగాణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి పేరు ఖరారైంది. జస్టిస్ హిమ కోహ్లీని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఢిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జి హోదాలో పని చేస్తున్నారు. ఆమెకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించినట్లు సమాచారం. ఏపీ హైకోర్టుకు సైతం దాదాపుగా కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా హిమ కోహ్లీ
సిక్కిం చీఫ్ జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పని చేస్తున్నారు. ఆయనను బదిలీ అయ్యారని సమాచారం. ఆయన స్థానంలో జస్టిస్ హిమ కోహ్లీని నియమించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గత ఏడాది జూన్లో తెలంగాణ హైకోర్టుగా నియమితులు అయ్యారు. ఏడాదిన్నర కాలంలోనే ఆయన బదిలీ అయ్యారు. దీనికి గల కారణాలు తెలియరావట్లేదు.
హిమ కోహ్లీ బయోడేటా
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వస్తున్న జస్టిస్ హిమ కోహ్లీ 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. ఆమె తన విద్యాభ్యాసాన్ని సెయింట్ థామస్ స్కూల్లో పూర్తి చేసి, డిగ్రీని ప్రముఖ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి పూర్తి చేశారు. హిస్టరీలో పీజీ చేసిన జస్టిస్ హిమ కోహ్లీ... ఆ తర్వాత ఎల్ఎల్బీ కోర్సును ఢిల్లీ యూనివర్శిటీలోని లా ఫ్యాకల్టీ, క్యాంపస్ లాసెంటర్ నుంచి పూర్తి చేశారు. 1984లో జస్టిస్ హిమ కోహ్లీ లా కోర్సును పూర్తి చేసి ఢిల్లీ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. 1994 నుంచి 2004వరకు ఢిల్లీ హైకోర్టులో హిమ కోహ్లీ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కు లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. ఆ తర్వాత 2004లో హిమ కోహ్లీ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఢిల్లీ హైకోర్టులో నియమితులయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం తరపున పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ఆమె వాదించారు.
పలు సంస్థల్లో లీగల్ అడ్వైజర్గా హిమ కోహ్లీ
ఢిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డుకు లీగల్ అడ్వైజర్గా కూడా సేవలందించారు.ఇదే కాకుండా నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులకు కూడా లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. 2006, మే 29న ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు.ఆ తర్వాత శాశ్వత జడ్జిగా 2007 ఆగష్టు 29న ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ లా యూనివర్శిటీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యురాలిగా ఈ ఏడాది జూన్ 30 నుంచి కొనసాగుతున్నారు. ఓ వైపు జడ్జిగా తన విధులను నిర్వర్తిస్తూనే ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణలో న్యాయవ్యవస్థ పాత్రను ప్రమోట్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై పలు అంతర్జాతీయ వేదికలపై జస్టిస్ హిమ కోహ్లీ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జితేంద్ర కుమార్ బదిలీ..?
అలాగే- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిని కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు. ఆయన స్థానంలో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామీని నియమిస్తారని తెలుస్తోంది. అరుప్ కుమార్ గోస్వామి స్థానంలో జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేయొచ్చని సమాచారం. జేకే మహేశ్వరి కూడా గత ఏడాదే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులు అయ్యారు. ఇదివరకు ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తాజాగా ఆయనను సిక్కింకు బదిలీ చేశారని సమాచారం.