రోహిత్ ఆత్మహత్య ఘటనపై జూడిషియల్ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టిన ఏకసభ్య న్యాయ సంఘం.. ఈ ఘటనపై ప్రజాభిప్రాయాలను తీసుకోనుంది. ఈ కమిషన్ను కేంద్ర మానవనరుల శాఖ నియమించింది.
కాగా, న్యాయ సంఘానికి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అశోక్కుమార్ రూపన్వాల్ ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
[email protected] అనే ఈ-మెయిల్ చిరునామాకు ఫిబ్రవరి 21లోగా ప్రజలు తమ అభిప్రాయాలను పంపించవచ్చని తెలిపారు. కాగా, విద్యార్థి సంఘాలకు 23న అవకాశం కల్పించారు. విద్యార్థి సంఘాలు, బోధన/ బోధనేతర సిబ్బంది ప్రతినిధులు ఫిబ్రవరి 23న హైదరాబాద్లోని యూజీసీ ప్రాంతీయ కార్యాలయంలో కమిషన్ను కలిసేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
వార్డెన్లు, విద్యార్థి సంక్షేమం చూసే డీన్, సమానావకాశాల విభాగం అధికారులు, ఎస్సీ-ఎస్టీ విభాగ అధికారులు, ర్యాగింగ్ నిరోధక విభాగం బాధ్యులు తమను ఫిబ్రవరి 24న కలవవచ్చని కమిషన్ తెలిపింది.
హెచ్సీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు, తాత్కాలిక వీసీ ఆచార్య ఎం పెరియస్వామి, ఇతర సీనియర్ అధికారులు, రిజిస్ట్రార్లు ఫిబ్రవరి 25వ తేదీన కలవవచ్చు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్న యంత్రాంగాన్ని కమిషన్ సమీక్షిస్తుంది.