జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత
హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీతో చికిత్స పొందకు ఉదయం తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూశారు.
సాయంత్రం అంత్యక్రియలు
లోకాయుక్త చైర్మన్గా పనిచేసిన సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. పలువురు ప్రముఖులు, న్యాయమూర్తులు, న్యాయకోవిదులు ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
మూడు కోర్టులకు చీఫ్ జస్టిస్
1942 మార్చి 2న హైదరాబాద్లో జన్మించిన సుభాషణ్ రెడ్డి.. సుల్తాన్ బజార్, చాదర్ ఘాట్ పాఠశాలల్లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన ఆయన.. 1966లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991 నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2001 సెప్టెంబర్ 12న మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించారు. తదనంతరం కేరళ జడ్జిగా సేవలందించి 2005 మార్చిలో రిటైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ తొలి ఛైర్మన్గా జస్టిస్ సుభాషణ్ రెడ్డి పనిచేశారు. లోకాయుక్త ఛైర్మన్గానూ వ్యవహరించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తిగా, మానవహక్కుల కమిషన్, లోకాయుక్త ఛైర్మన్గా ఆయన అందించిన సేవలు గుర్తుచేసుకున్నారు. అధికార లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు.