మైనర్లు మేజర్లుగా విచారణ: అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో జువైనల్ జస్టిస్ బోర్డ్ సంచలనతీర్పు
జూబ్లీహిల్స్ ఆమ్నీషియా పబ్ కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్ లను పెద్దలుగా విచారించవచ్చని జువైనల్ జస్టిస్ బోర్డు శుక్రవారం తెలిపింది. నేరానికి పాల్పడిన ఐదుగురు మైనర్ లలో నలుగురు మైనర్ లను విచారణ సందర్భంగా మేజర్ లుగా పరిగణిస్తూ బోర్డు తీర్పునిచ్చింది.
నలుగురి మానసిక స్థితిని విశ్లేషించిన జువైనల్ జస్టిస్ బోర్డు
నిందితులు అందరూ తీవ్రమైన నేరానికి పాల్పడిన దృష్ట్యా వీరిని మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ను పోలీసులు కోరారు. నలుగురిని ప్రత్యేకంగా విచారించిన బోర్డు మానసిక నిపుణుల సహాయంతో నిందితుల మెంటల్ స్టేటస్ ను విశ్లేషించింది.
ఇక మరొక నిందితులు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కొడుకు అత్యంత దారుణమైన నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లేవు కాబట్టి అతనికి సంబంధించి ఎటువంటి ప్రాథమిక అంచనాలు నిర్వహించబడలేదని జువైనల్ జస్టిస్ బోర్డు పేర్కొంది. మిగిలిన నలుగురు నిందితులు చేసిన నేరాలు హేయమైనవి కాబట్టి వారి కోసం మూల్యాంకన నిర్వహించబడింది అని ఉత్తర్వులలో జువైనల్ జస్టిస్ బోర్డు వెల్లడించింది.
మేజర్లు గా పరిగణించి విచారణ జరపాలన్న బోర్డు
ఏ వన్ సయ్యద్ నిజాల్ ఫజిలత్, ఏ 2 మహమ్మద్ కొమరానుల్లా ఖాన్, ఏ 3 హబీబ్ , ఏ ఫోర్ రాహిల్ ఖాన్ లను మేజర్ లుగా పరిగణిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురి మానసిక స్థితిని విశ్లేషించిన సైకియాట్రిస్ట్ ఈనెల 28వ తేదీన నలుగురి మానసిక స్థితిపై నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో నేరం జరిగిన సమయంలో వీరెవరూ మద్యం సేవించ లేదని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే మైనర్ బాలికపై వీరు అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన జువైనల్ జస్టిస్ బోర్డు, నాంపల్లి చిల్డ్రన్స్ కోర్టుకు కేసును బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది.
నలుగురు మైనర్ల మానసిక, శారీరక సామర్ధ్యాన్ని మూల్యాంకనం చేసిన బోర్డు .. కీలక ఉత్తర్వులు
నలుగురు మైనర్లకు మానసిక, శారీరక సామర్థ్యం ఉందని వారికి ఎటువంటి మానసిక శారీరక దౌర్బల్యం లేదని మానసిక వైద్యుడి అభిప్రాయంతో జువైనల్ జస్టిస్ బోర్డు ఏకీభవించింది. బాధితురాలు వారిని పెద్దగా వారించకపోవడం వల్ల నిందితులు ఆకర్షితులయ్యారు అని నిందితులకు న్యాయపరమైన విద్య లేదని, అందువల్ల వారు న్యాయ పరమైన ఇబ్బందులను అర్థం చేసుకోలేకపోతున్నారు అని జస్టిస్ జువైనల్ బోర్డు అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా సంభాషించి వారు చెప్పిన వివిధ అంశాలను క్రోడీకరించిన తర్వాత మైనర్ లను మేజర్ గా పరిగణిస్తూ విచారణ జరపవచ్చని కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది.