మోడీపై కేసీఆర్ దూకుడు వెనుక మరో కోణం!: జైపాల్ బాంబు, కేసీఆర్ను వదిలేది లేదని బీజేపీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని వ్యతిరేకించడంలో మరో కోణం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లాలూచీ కుస్తీ జరుగుతోందన్నారు.
ప్రగతి శీల శక్తులు, మైనార్టీలను మరోసారి మోసం చేసేందుకే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బాంబు పేల్చారు. ఆ రెండు పార్టీలది లాలూచీ కుస్తీ అన్నారు. ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. ప్రధాని మోడీని మాత్రమే కేసీఆర్ ఏకవచనంతో మాట్లాడలేదని, గతంలో రాహుల్ గాంధీని కూడా ఇలా సంబోధించారన్నారు.
మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్
కేసీఆర్ అవకాశవాది, జాతీయ రాజకీయాల పైనే ఆసక్తి
కేసీఆర్ అవకాశవాది అని జైపాల్ రెడ్డి మండిపడ్డారు. 2014లో బీజేపీతో అవగాహనకు ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో లేదా ఎన్నికల తర్వాతైనా రెండు పార్టీలు కలిసిపోతాయన్నారు. రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాల పైనే తనకు ఆసక్తి ఎక్కువని, వచ్చే ఎన్నికల్లో మహబూబ్నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని జైపాల్ రెడ్డి చెప్పారు.
మోడీతో కేసీఆర్ ఏకీభవించారు
నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక అంశాలపై మోడీతో కేసీఆర్ ఏకీభవించారని జైపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. 2014లోనే బీజేపీతో వెళ్దామని కేసీఆర్ భావించారని, కానీ టీడీపీతో ఆ పార్టీకి పొత్తు కుదరడంతో ఆగిపోయారన్నారు.
అది పెద్ద పొరపాటు
తెలంగాణలో కేసీఆర్కు తాము పోటీ అని, కాబట్టి ఆయన తమతో కలిసి వచ్చే సమస్యే ఉండదని జైపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి బీజేపీ దరి చేరుతారన్నారు. మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నారని భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుందన్నారు.
కేసీఆర్ను వదిలేది లేదు
మరోవైపు, మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన కుటుంబ సభ్యులు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏమాత్రం హర్షించలేనివన్నారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ మాట్లాడే మాటలు ఇవేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అంతవరకు ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్కు పట్టడం లేదన్నారు.