చిక్కులకు చెక్: మరో శక్తివంతమైన యాగానికి సిద్ధమైన కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు అనుకోని చిక్కులు ఎదురవుతుండటంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అందుకు విరుగుడుగా యాగం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మిషన్ భగీరథకు ఎదువుతున్న అడ్డంకులను ఎదుర్కొవాలంటే ప్రత్యేక యాగం చేయక తప్పదని తలచినట్లు తెలుస్తోంది. ఇందు కోసం సొంత నియోజకవర్గం గజ్వేలులో యాగానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
తాము చెప్పిన సమాయానికి మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేయని పక్షంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగబోదని ముఖ్యమంత్రి కెసిఆర్ పలుమార్లు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథకు ఎదువుతున్న అడ్డంకులను అధిగమించేందుకు విష్ణుమూర్తి భగవానుడిని వేడుకునేందుకు సుదర్శన యాగం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
'ఈ యాగం చాలా శక్తివంతమైనది. విజయాన్ని, అభివృద్ధిని కాంక్షించే ఎవరైనా ఈ యాగం చేయవచ్చు. యాగం చేసిన వారు అనుకున్నది సాధిస్తారు. ఈ యాగం వల్ల తాము చేపట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ప్రతికూల ఆలోచనలకు బదులు సానుకూల ఆలోచనలను మనముందుకు తెస్తుంది' అని యాగ కార్యక్రమాలు చూసుకుంటున్న ఓ టిఆర్ఎస్ నేత పేర్కొన్నారు.
ఏప్రిల్ 30 వరకు వాటర్ గ్రిడ్ ఫలాలు నాలుగు జిల్లాల్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందాల్సి ఉంది. ఇందులోనే ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ప్రభుత్వం యంత్రాలతో పనులు చేస్తున్నప్పటికీ పనులు అంత వేగంగా సాగడం లేదు.
ఇలాగే కొనసాగితే మొదటి దశ సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశాలు లేవు. ఈ క్రమంలో ప్రాజెక్టు పూర్తి కాకుండా ఏవో ప్రతికూల శక్తులు పని చేస్తున్నాయని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్.. శక్తివంతమైన సుదర్శన యాగం చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ మొదటి వారంలో వాటర్ గ్రిడ్ కార్యకలాపాలు మొదలు కానున్న సమయంలోనే సుదర్శన యాగాన్ని కూడా నిర్వహించాలని తలపెట్టినట్లు సమాచారం. గత డిసెంబర్లో అయూత చండీ మహా యాగాన్ని ఎర్రవల్లిలోని ఫాంహౌజ్లో ఐదు రోజులపాటు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.