అమిత్ షా అలా అనడం ఏమిటి?: కేసీఆర్ ఫ్రంట్పై సురవరం అనుమానాలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా కూటమిని ఏర్పాటు చేసుకునే అవకాశముందని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మాట్లాడటం ఏమిటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.
బీజేపీకి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. మరో ఫ్రంట్ను అమిత్ షా స్వాగతించడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వారెవరూ కేసీఆర్ ఫ్రంట్లో చేరబోరన్నారు.
వామపక్షాలు, తమతో పాటు కలసి వచ్చే పార్టీలతో కలసి ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలపై వామపక్షాల నాయకత్వం కింద వర్గ పోరాటాలు చేస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన జన నిఘా జన ఆందోళన పేరుతో వామపక్ష ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయని, వాటికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, సీపీఎంతో కలిసే పోరాటాలు చేస్తామని చెప్పారు. దేశానికి ఎవరు ప్రధాన శత్రువు అనే విషయంలో కేసీఆర్తో తమ పార్టీకి అభిప్రాయ భేదాలున్నాయన్నారు. తెలంగాణ జన సమితి కోదండరాంతో కలిసి పని చేసే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
దేశానికి, ప్రజలకు నష్టం కలిగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఓడించడం ముఖ్యమని తాము భావిస్తున్నామని, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామని కేసీఆర్ అంటున్నారని, ఇద్దరికీ మధ్య తేడా అదే అన్నారు. బీజేపీకి సానుకూలమైన పద్ధతుల్లో ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికి కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రంట్ ఉపయోగపడొచ్చన్నారు.