ఇటు కొత్త బాధ్యతలు...అటు బంపరాఫర్: ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ వైఖరేంటి..?
హైదరాబాద్ : గతేడాది డిసెంబరు నెలలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతకుముందు తమ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు అభ్యర్థులు. రాత్రనక పగలనక ప్రచారంతో హోరెత్తించారు. తమ నియోజకవర్గాల్లో కలియతిరుగుతూ తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించి కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ బాధ్యతలు అప్పజెప్పారు. వారికి కేసీఆర్ అప్పజెప్పిన బాధ్యతలేంటి.. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే వారికి ఎలాంటి ఆఫర్ దక్కే అవకాశముంది..?
కేంద్రంలో కీలకంగా మారాలని భావిస్తున్న గులాబీ దళపతి
గతేడాది డిసెంబరులో తెలంగాణకు జరిగిన ఎన్నికలు తర్వాత టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ దూసుకెళుతున్నారు. అన్ని రాష్ట్రాల బీజేపీ కాంగ్రెసేతర నాయకులను కలుస్తూ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో గులాబీ అధిపతి ఈ ఎన్నికలపై దృష్టి సారించారు. 16 పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్రంలో కీలకంగా మారాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యేలకు కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఖమ్మం, మహబూబాబాద్లను సీరియస్గా తీసుకున్న కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను టీఆర్ఎస్ 14 పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ సాధించింది. ఒక్క హైదరాబాదు, ఖమ్మం, మహబూబాబాద్లో తప్పి మిగతా పార్లమెంటు పరిధిలో స్పష్టమైప మెజార్టీని కనబర్చింది. హైదరాబాద్లో టీఆర్ఎస్ మిత్రపార్టీ ఎంఐఎం మెజార్టీ కనబర్చగా.. ఖమ్మం మహబూబాబాద్లో కాంగ్రెస్ నేతృత్వంలోని పీపుల్స్ ఫ్రంట్ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీంతో కేసీఆర్ వీటిపై కూడా కన్నేశారు. ఇందుకోసం వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.
కష్టపడు..ఫలితం పొందు అంటున్న కేసీఆర్
ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు ఉండకపోవచ్చు. ఇది కచ్చితంగా ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ కానుంది. ఇక్కడే కేసీఆర్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించగలిగితే ఆ ఎమ్మెల్యేల పంట పండినట్లే అని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా కష్టపడి అభ్యర్థులను గెలిపించిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలంగాణ భవన్లో చర్చ జరుగుతోంది. ఇలా అయితే కేబినెట్ పదవి కోసం ఎమ్మెల్యేలు తప్పకుండా లోక్సభ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారనే భావన టీఆర్ఎస్ పార్టీలో ఉంది.
బేధాభిప్రాయాలు వీడాల్సిందే...బాస్ ఆదేశం
ఇక చాలా చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటివి ఎట్టిపరిస్థితుల్లో పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం కృషి చేయాల్సిందిగా కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 100 సీట్లు వస్తాయని చెప్పారు కేసీఆర్. కానీ 88 సీట్లను మాత్రమే గెలిచింది. నాయకుల మధ్య కొన్ని చోట్ల బేధాభ్రిప్రాయాలు రావడంతోనే 10 నుంచి 15 సీట్లు టీఆర్ఎస్ కోల్పోయిందని స్వయంగా కేసీఆర్ చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి పొరపాటు రిపీట్ కావొద్దనే కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్ ఎమ్మెల్యేలు తప్పకుండా సహకరించాల్సిందే అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. ఒకవేళ సొంత పార్టీ అభ్యర్థి గెలవకుండా ఎమ్మెల్యేలు అడ్డుపడినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వెనకాడరనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.