ముఖ్యమంత్రి కెసిఆర్కు ఢిల్లీలో బంగళా
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు కేంద్రం ఢిల్లీలో బంగళాను కేటాయించింది. తొలి విడత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తుగ్లక్ రోడ్లో (నం. 23) కేటాయించిన బంగళానే కేంద్రం ఖరారుచేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి ఢిల్లీలో ప్రత్యేక భవన్ లేనందున.. ప్రస్తుతం కేసీఆర్ స్వాధీనంలో ఉన్న బంగళానే కొనసాగించుకోవచ్చునని భవనాల కేటాయింపు క్యాబినెట్ కమిటీ స్పష్టం చేసింది.
గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశం తెలంగాణ, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఢిల్లీలో బంగళాలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అసోం రాష్ర్టానికి కూడా ఢిల్లీలో భవన్ నిర్మాణంలో ఉన్నందున సీ -1 టైప్ బంగళాను ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ వాడుకోవచ్చునని ఈ సమావేశం నిర్ణయించింది.
అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రాష్ర్టానికి భవన్ లేనందువల్ల ప్రస్తుతం వినియోగించుకుంటున్న తుగ్లక్ రోడ్డులోని బంగళాను వాడుకోవచ్చని నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు జంతర్మంతర్లో కేటాయించిన బంగళాను మాత్రం కొనసాగించుకోడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
రాష్ర్టాల సీఎంలకు బంగళాలను కేటాయించాలన్న నిబంధన 1988 నాటి చట్టం ప్రకారం లేనందువల్ల హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆ అవకాశం లేదని సమావేశం పేర్కొంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్రావత్కు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఆరోగ్య కారణాలతో కేటాయించిన బంగళా కాలపరిమితి వచ్చే జూన్తో ముగుస్తున్నందున.. అప్పటివరకు కొనసాగవచ్చునని.. తర్వాత మాత్రం ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.