కేటీఆర్ కోసం కేసీఆర్ సెల్ఫ్గోల్, ఢిల్లీలో పిల్లిలా..ఇక్కడేమో..: లక్ష్మణ్, ‘టీఆర్ఎస్కు సానుభూతి’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, నిజామాబాద్ నేత ధర్మపురి అరవింద్ వేర్వేరుగా మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ దారుణంగా విఫలమైందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో సోమవారం మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నిర్వహించిన ప్రగతిన నివేదన సభ.. కేసీఆర్ ఆవేదన సభగా మారిందని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ కోసం కేసీఆర్ సెల్ఫ్ గోల్..
తన కుమారుడిని సీఎం చేయాలని తలపెట్టి తనకు తానే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని కేసీఆర్పై లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా సభ నిర్వహించి రూ.300 కోట్ల ధనాన్ని వృథాతోపాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. డబ్బు వెదజల్లి రాజకీయాలు చేయాలనుకుంటున్న సీఎం కేసీఆర్కు ఈ సభ ఒక గుణపాఠంలాంటిదని లక్ష్మణ్ అన్నారు.
Recommended Video
ఢిల్లీకి వెళ్తే పిల్లిలా.. ఇక్కడేమో పులిలా..
ప్రగతి నివేదన సభ మొత్తంగా అట్టర్ ఫ్లాప్ అయిందని లక్ష్మీణ్ అన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపితే ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా కేసీఆర్ ఆయన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదని లక్ష్మణ్ హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే పిల్లిలా, హైదరాబాద్లో మాత్రం పులిలా గంభీరం ప్రదర్శిస్తారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్కు ప్రగాఢ సానుభూతి
మరో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్, ప్రగతి నివేదన సభపై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ సభ విఫలమైందని, కాబట్టి ఆ పార్టీకి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్కు అంత సీన్ లేదు..
టీఆర్ఎస్ సభకు వచ్చింది కేవలం రెండున్నర లక్షల మందేనని, రేపు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్కు 20 సీట్ల కంటే ఎక్కువ రావని అరవింద్ జోస్యం చెప్పారు. రానున్న రోజుల్లో కారు అడ్డంగా బోర్లా పడుతుందన్నారు. ప్రధాని మోడీని జోనల్ వ్యవస్థపై చేస్తావా, లేక చస్తావా అనేంత సీన్ కేసీఆర్కు లేదని అరవింద్ వ్యాఖ్యానించారు.