కేఏ పాల్ మీద కామెడీ చేస్తున్న వారందరికీ ఇక మూడినట్లేనా..?
హైదరాబాదు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా నేతలను నెటిజెన్లు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారని చెబుతూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మధ్యే వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిలా కూడా పోలీసులను ఆశ్రయించి సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. ఆ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే ప్రముఖ మతబోధకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ అవహేళన చేస్తున్నారని పాల్ ఫిర్యాదు చేశారు.
కేఏ పాల్.... 2009 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికల్లో వినిపిస్తున్న పేరు. ఆయన ఏమి మాట్లాడినా నెటిజెన్లు ఆసక్తిగా చూస్తారు. ప్రజాశాంతి పేరుతో పార్టీ పెట్టిన కేఏ పాల్... అడపా దడపా దర్శనమిస్తున్నప్పటికీ... ఎన్నికల వేళ మాత్రం తాను పూర్తిస్థాయిలో కనిపిస్తారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ఊసు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో వినిపించదు కనిపించదు. తొలుత ప్రముఖ మతబోధకుడిగా ఉన్న కేఏ పాల్ ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టి పొలిటీషియన్ అవతారమెత్తాడు. ఇక ఎన్నికల సీజన్ అయినందున ఏ టీవీ ఛానెల్ అయినా చర్చకు ఆహ్వానిస్తే నో అనకుండా అక్కడ వాలిపోతారు పాల్. అయితే పాల్ చెప్పే మాటలను నెటిజెన్లు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. పాల్ ఏమి మాట్లాడినా.. ఏది మాట్లాడినా అందులో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఆయన్ను చిక్కుల్లో పడేసింది.
తాజాగా కేఏ పాల్... హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను కలిశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం వాటిల్లేలా కొందరు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో కేఏ పాల్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన కేఏ పాల్...వాటికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. తన తమ్ముడి హత్య కేసులో తనకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేసిన పాల్... ఇప్పటికి కూడా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు వెంటనే రక్షణ కల్పించాలని సీపీ అంజన్ కుమార్ను కోరారు కేఏ పాల్.