కడియం శ్రీహరి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం .. ఆ దుస్థితి లేదన్న కడియం
Recommended Video
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ కు గుడ్ బైచెప్పనున్నారా ? ఆయన పార్టీలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారా ? ఆయనకు సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారా ? అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన తన పట్టు పూర్తిగా కోల్పోయారా అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది . టీఆర్ఎస్ లో తీవ్రమైన వివక్షకు గురైనట్లు ఆయన భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గం చెప్తోందని ప్రచారం జరుగుతుంది .
గులాబీ పార్టీలో ప్రాధాన్యం కోల్పోయిన కడియం శ్రీహరి .. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవటంతో మొదలైన విబేధాలు అంటూ ప్రచారం
సీనియర్ రాజకీయవేత్త మరియు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేత కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాలో గతంలో మంచి స్థానం ఇచ్చి గౌరవించారు సిఎం కెసీఆర్ . మునుపటి మంత్రివర్గంలో విద్యా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీహరి 2018 అసెంబ్లీ ఎన్నికలలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. కానీ, పార్టీ చీఫ్ కెసిఆర్ అతనికి టికెట్ నిరాకరించి అక్కడ ఉన్న సిట్టింగ్ శాసనసభ్యుడు రాజయ్యకు ఇచ్చారు. ఇక ఆ తర్వాత రాజయ్య వద్దంటూ కడియం వర్గం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. రాజయ్య మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తాడని ఒక ఆడియో అప్పుడు హల్ చల్ చేసింది. దీంతో రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని కడియం బాగానే పట్టు పట్టినా కేసీఆర్ వినిపించుకోలేదు . రాజయ్యకే టికెట్ ఇచ్చారు .
ఎంపీగానూ నో ఛాన్స్.. ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వటంతో జిల్లాలో తగ్గిన ప్రాధాన్యం
ఇక ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కూడా తన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపి టికెట్ ప్రకటించాలని కడియం చేసిన అభ్యర్థనను కెసిఆర్ పట్టించుకోలేదు. అంతే కాదు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లోని కడియం శ్రీహరి అనుచరులకు టికెట్లు దక్కలేదు. దీంతో కడియం చాలా అసంతృప్తితో ఉన్నారని టాక్ వినిపిస్తుంది . ఇక పుండు మీద కారం చల్లినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా అవకాశం ఇవ్వటం జిల్లాలో మరింత ప్రాధాన్యం కోల్పోయేలా చేసింది. ఈ వరుస సంఘటనలతో చాలా అసహనంతో ఉన్న కడియం శ్రీహరిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతుంది.
బీజేపీవైపు చూస్తున్న కడియం శ్రీహరి.. పావులు కదుపుతున్న బీజేపీ
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లో చేరారు కడియం శ్రీహరి . ఎన్టీఆర్ హయాంలో ఆయన మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఆయనకు కేసీఆర్ గత ప్రభుత్వంలో సముచిత స్థానం ఇచ్చారు. కానీ ఈ దఫా మాత్రం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకే ఆయన కూడా బీజేపే వైపు చూస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది . ఇక భారతీయ జనతా పార్టీ సైతం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో పార్టీని బలోపేతం చెయ్యటంలో భాగంగా వివిధ పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలను టార్గెట్ చేసి మరీ ప్రయత్నాలు సాగిస్తుంది.
బీజేపీలో చేరేది లేదు .. ఆ వార్తలన్నీ అవాస్తవం అన్న కడియం శ్రీహరి
అయితే కడియం శ్రీహరి మాత్రం తనపై వస్తున్న వార్తలపై సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలు రాస్తే సీరియస్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రచారం నమ్మొద్దని తానూ టీఆర్ఎస్ పార్టీ వీడి వెళ్ళేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇంతకాలం మౌనంగా ఉన్న కడియం శ్రీహరి తాజా వార్తల నేపధ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. తనకు బీజేపీలో చేరే ఆలోచన కానీ , అవసరం కానీ లేవని , రాజకీయ స్వార్ధం కోసం పార్టీలు మారే స్వభావం నాది కాదని ఆయన పేర్కొన్నారు. తాను అంబేద్కర్ వాదినని వామపక్ష భావజాలం ఉందని కుల మతాల పేరుతో రాజకీయాలు చేసే పార్టీలోకి వెళ్లనని తేల్చి చెప్పారు.