సైలెంట్ గా కడియం శ్రీహరి సందడి మొదలెట్టారుగా... చలో కాళేశ్వరం అంటున్న కడియం మతలబు అదేనా ?
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆయన పార్టీలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, ఆయనకు సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారని ఆయన అనుచరుల్లో ఆవేదన ఉంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కడియం తన పట్టు పూర్తిగా కోల్పోయారన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగానే జరిగింది . దీంతో ఇంత కాలం అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్న కడియం శ్రీహరి తాజాగా కాస్త జోష్ లో కనిపిస్తున్నారు. ఇక తాజాగా చలో కాళేశ్వరం అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన కార్యక్రమం చేపట్టటం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. దీని వెనుక మతలబు ఉంది అన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
గత ఎన్నికల నుండి పార్టీలో క్రమంగా తగ్గిన కడియం ప్రాధాన్యత.. జిల్లాలోనూ కడియం సైలెంట్
సీనియర్ రాజకీయవేత్త టిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాలో గతంలో మంచి స్థానం ఇచ్చి గౌరవించారు సిఎం కెసీఆర్ . మునుపటి మంత్రివర్గంలో విద్యా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీహరి 2018 అసెంబ్లీ ఎన్నికలలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు. కానీ, పార్టీ చీఫ్ కెసిఆర్ అతనికి టికెట్ నిరాకరించి అక్కడ ఉన్న సిట్టింగ్ శాసనసభ్యుడు రాజయ్యకు ఇచ్చారు. ఇక ఆ తర్వాత రాజయ్య వద్దంటూ కడియం వర్గం చేసిన హడావిడిచేసి తన అనుచరగణంతో రాజయ్యకు టికెట్ ఇవ్వొద్దని కడియం చేసిన న్యూసెన్స్ నచ్చని సీఎం కేసీఆర్ ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కూడా తన కుమార్తె కావ్యకు వరంగల్ ఎంపి టికెట్ ప్రకటించాలని కడియం చేసిన అభ్యర్థనను పట్టించుకోలేదు. ఇక పుండు మీద కారం చల్లినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు పంచాయితీ రాజ్ శాఖామంత్రిగా అవకాశం ఇవ్వటం జిల్లాలో మరింత ప్రాధాన్యం కోల్పోయేలా చేసింది. ఈ వరుస సంఘటనలతో చాలా అసహనంతో ఉన్న కడియం శ్రీహరి బీజేపీలో చేరతారని చర్చ జరిగింది. కానీ ఆయన అలాంటి ఆలోచన లేదని ప్రకటించారు. ఇక అప్పటి నుండి సైలెంట్ గా ఉంటున్నారు.
చలో కాళేశ్వరం అంటూ కడియం కార్యక్రమం .. మంత్రి వర్గ విస్తరణ నేపధ్యంలో ఉనికి చాటుకునే యత్నం
జిల్లాలో పట్టు లేక , కీలక పదవి లేక తన ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని విలవిలలాడుతున్న కడియం శ్రీహరి మరో మారు తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు అన్న వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి తన ఉనికిని, కెసిఆర్ పట్ల ఉన్న స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరుతో కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 4న చలో కాళేశ్వరం అంటూ ప్రాజెక్టు సందర్శన చేయనున్నారు. గోదావరి నీటిని ఒడిసి పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసిన అద్భుత నిర్మాణం అని , సీఎం కేసీఆర్ గారి కల సాకారమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కదలిరండి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు.
కేసీఆర్ పై స్వామీ భక్తి ప్రదర్శిస్తున్న కడియం .. ఈ సారి చాన్స్ రాకుంటే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకమే !!
అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరధుడు అని ఆయన చేసిన ప్రయత్నాన్ని చూడాలని, అన్నదాతలకు నీటి కొరత తీర్చే ఆపన్నహస్తం కాళేశ్వరం అని కాళేశ్వరం సందర్శనకు అందరూ రావాలని కార్యక్రమాన్ని చేపట్టారు కడియం శ్రీహరి. అయితే ఇంతకాలం అన్ని కార్యక్రమాల్లోనూ అంటి ముట్టనట్టు గా వ్యవహరించిన కడియం శ్రీహరి, ఆయనే సొంతంగా కార్యక్రమం చేపట్టి కెసిఆర్ దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కడియం శ్రీహరి చేస్తున్న ఈ ప్రయత్నం వెనక మతలబు అదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ దఫా మంత్రి వర్గ విస్తరణలో కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వకపోతే కడియం శ్రీహరి పరిస్థితి పార్టీలో దారుణంగా ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుంది అన్న భావన సైతం లేకపోలేదు . మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.