ఎన్నో ఎత్తుపల్లాలు చూశా, ఆ తర్వాతే రిటైర్మెంట్: తేల్చిన కడియం
తన రాజకీయ పదవీ విరమణపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. తాను ఎమ్మెల్సీగా 2021 వరకు ఉంటానని, ఆ తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి అన్నారు.
హైదరాబాద్: తన రాజకీయ పదవీ విరమణపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. తాను ఎమ్మెల్సీగా 2021 వరకు ఉంటానని, ఆ తర్వాతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి అన్నారు. తాను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని గుర్తుచేసుకున్నారు.
సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో కడియం శ్రీహరి కాసేపు ముచ్చటించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల దుష్ఫలితాలు కనిపించాయని చెప్పారు. అంతేగాక, ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల కాలేజీలు ఎక్కువగా.. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండే పరిస్థితి వచ్చిందని అన్నారు.
కళాశాలల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేశామని, సరిపడా హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం స్పష్టంచేశారు. కార్పొరేట్ కళాశాలలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కూడా సీరియస్గా ఉన్నారని చెప్పారు.
ఇటీవల కార్పొరేట్ కళాశాలతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టంగా చెప్పామన్నారు. విద్యావ్యవస్థ పూర్తిగా గాడిలో పడాలంటే మరో ఐదేళ్లు పడుతుందని కడియం చెప్పారు. కాలేజీ, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. తీరు మార్చుకోకుంటే చిప్పకూడు తప్పదన్నారు.